రెండు రాష్ట్రాల మధ్య విభజన అంశాలపై శనివారం జరగనున్న ముఖ్యమంత్రుల సమావేశం తర్వాతనే తెలుగు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (బీఆర్ఏవోయూ)లకు సంబంధించిన పలు అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సీఎంల భేటీ అనంతరమే వీటిలో ప్రవేశాలకు నోటిఫికేషన్లు జారీకానున్నాయి. విభజన జరిగి పదేళ్లు పూర్తయినందున.. ఈ విశ్వవిద్యాలయాలు ఆయా రాష్ట్రాల వారీగా కార్యకలాపాలను కొనసాగించాల్సి ఉంటుంది. కానీ, ఏపీ పూర్తి స్థాయి చర్యలు తీసుకోలేదు. దీంతో ప్రవేశాలు, ఇతర కార్యకలాపాలపై సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలో జరుగుతున్న సీఎంల సమావేశంలో తెలుగు, బీఆర్ఏవోయూల విభజన కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. కార్యకలాపాలు వేర్వేరుగా కొనసాగించడంపై విశ్వవిద్యాలయాల అధికారులు గతంలోనే ఏపీకి లేఖ రాశారు. వారు మాత్రం ఈ ఏడాదికి మినహాయింపును కోరారు. ఈ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా.. ఎలాంటి నిర్ణయమూ వెలువడలేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa