ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది.. అన్న క్యాంటీన్ల పున: ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం కాబట్టి.. ఆరోజు కొన్ని క్యాంటీన్లను పేదలకు అందుబాటులోకి తీసుకొచ్చే విషయాన్ని పరిశీలిస్తోంది. అయితే అధికారికంగా ప్రకటన మాత్రం రావాల్సి ఉంది. ఏపీ ప్రభుత్వం తొలి దశలో 183 క్యాంటీన్లు ప్రారంభించాలని టార్గెట్గా పెట్టుకుంది.. ఈ మేరకు ఏర్పాట్లు చేపట్టారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన క్యాంటీన్ భవనాలను అన్ని సౌకర్యాలతో సిద్ధం చేసే పనిలో ఉన్నారు అధికారులు. దీనికి సంబంధించిన టెండర్లు పిలిచి పనులను వేగంగా పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. గతంలో ప్రారంభించిన 183 క్యాంటీన్లను రూ.20 కోట్లతో మరమ్మతులు చేస్తున్నారు. అలాగే క్యాంటీన్లలో ఐవోటీ డివైజ్ల ఏర్పాటు చేయడంతో పాటుగా సాఫ్ట్వేర్ అప్లికేషన్ కోసం రూ.7 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. రాష్ట్రవ్యాప్తంగా 20 క్యాంటీన్లకు కొత్త భవనాల నిర్మాణం, పాత పెండింగ్ బిల్లుల చెల్లింపుల కోసం మరో రూ.65 కోట్లను కూడా విడుదల చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా తొలి దశలో ప్రారంభించే 183 క్యాంటీన్లకు ఆహారం సరఫరా చేసేందుకు టెండర్లను పిలిచారు అధికారులు. ఈ నెల 22 టెండర్లకు చివరి రోజు కాగా.. ఈ నెలాఖరులోగా ఆహారం సరఫరా చేసే సంస్థలకు సంబంధించిన టెండర్లు ఖరారు చేస్తారు. అలాగే అన్న క్యాంటీన్ల పేరుతో ట్రస్ట్ ప్రారంభించి.. ప్రత్యేకంగా వెబ్సైట్ తయారు చేసే పనిలో ఉన్నారు. క్యాంటీన్ల నిర్వహణకు దాతల నుంచి విరాళాలు సేకరించాలని.. వీటికి ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటుంది అంటున్నారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అన్న క్యాంటీన్లకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. ఎవరైనా వారి పుట్టినరోజు సందర్భంగా అన్న క్యాంటిన్ ద్వారా భోజనం అందించొచ్చని చెప్పారు.
ఇదిలా ఉంటే రాష్ట్రవ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలు ఇప్పటికే అన్న క్యాంటిన్లు ప్రారంభించారు.. అక్కడ భోజనం అందుబాటులోకి వచ్చింది. అంతేకాదు గత ప్రభుత్వ హయాంలో కూడా కొందరు టీడీపీ నేతలు వారి, వారి నియోజకవర్గాల్లో ఈ అన్న క్యాంటీన్లను ప్రారంభించారు. ప్రతిరోజూ పేదలకు భోజనం అందుబాటులోకి తెచ్చారు. ఆ అన్న క్యాంటిన్లు కూడా ఇప్పటికి కొనసాగుతున్నాయి. వీటిని మినహాయించి ఇప్పుడు మరికొన్ని క్యాంటీన్లను ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తోంది ప్రభుత్వం. వీలైనంత త్వరగా అన్నా క్యాంటీన్లను ప్రారంభించి పేదవాడికి అందుబాటులోకి తేవాలని భావిస్తున్నారు. అన్న క్యాంటిన్లలో రూ.5కే ఎంతో రుచికరమైన భోజనాన్ని పేద, మధ్యతరగతి ప్రజలకు అందబాటులోకి తీసుకురానున్నారు.
అన్న క్యాంటిన్లలో ధరల విషయానికి వస్తే.. గతంలో నడిపిన అన్న క్యాంటీన్లో కేవలం రూ.5కే టిఫిన్, భోజనం అందించేవారు. కొత్తగా ఓపెన్ కాబోతున్న అన్న క్యాంటీన్లో ధరలు ఎలా ఉండబోతున్నాయనే చర్చ కూడా ఉంది. అయితే అన్న క్యాంటీన్లో కేవలం రూ.5కే టిఫిన్, రూ.5కే భోజనం లభించనుంది. కేవలం రూ.10 రూపాయలకే రెండు పూటలా కడుపునిండా ఫుడ్ తినొచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa