ఏపీకి చెందిన సీనియర్ ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్ వీఆర్ఎస్ (స్వచ్ఛంద పదవీ విరమణ) తీసుకున్నారు. ప్రవీణ్ ప్రకాష్ వీఆర్ఎస్కు ప్రభుత్వం ఆమోదం తెలపగా.. సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ నోటిఫికేషన్ జారీ చేశారు. గత నెల 25న ప్రవీణ్ ప్రకాస్ వీఆర్ఎస్కు దరఖాస్తు చేసుకోగా.. తాజాగా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఆయనకు ఏడేళ్లు సర్వీస్ ఉన్నా సరే వీఆర్ఎస్ తీసుకోడం చర్చనీయాంశమైంది. ప్రవీణ్ ప్రకాష్ వీఆర్ఎస్ సెప్టెంబరు 30 నుంచి అమల్లోకి వస్తుందని నోటిఫికేషన్లో ప్రస్తావించారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత.. సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాలని ప్రవీణ్ ప్రకాష్కు ప్రభుత్వం సూచించింది. ప్రవీణ్ ప్రకాష్ వీఆర్ఎస్కు దరఖాస్తు చేయడంలో కొంత వివాదం రేగింది.. ఆయన వీఆర్ఎస్ దరఖాస్తులో సంతకం చేయకుండా డిజిటల్ సంతకం చేశారు. అయితే ఆ సంతకం చెల్లదని ప్రభుత్వం చెప్పడంతో మళ్లీ దరఖాస్తు చేశారు. అంతేకాదు ప్రవీణ్ ప్రకాష్ను గత నెల 19న బదిలీ చేయగా.. ఆయనకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు. అప్పటి నుంచి ఆయన ఇన్స్టాగ్రామ్లో రీల్స్ కూడా చేశారు. కృష్ణా నది తీరంలో, ఆయన నివాసం ఉండే విల్లా, దేవాలయం వద్ద హిందీ పాటలకు అభినయిస్తూ రీల్స్ చేయడం చర్చనీయాంశమైంది.
గత ప్రభుత్వ హయాంలో ప్రవీణ్ ప్రకాష్ తీరుపై కొన్ని విమర్శలు వచ్చాయి. కొన్ని టెండర్లు, కాంట్రాక్ట్ల విషయంలో ఆరోపణలు వచ్చాయి. ఆయన కొందరు టీచర్లను బెదరించారనే విమర్శలు వచ్చాయి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవీణ్ ప్రకాష్ వీఆర్ఎస్ వైపు అడుగులు వేస్తారని ప్రచారం జరిగింది. ఒకానొక సమయంలో ఉత్తరప్రదేశ్ నుంచి ఎన్నికల బరిలోకి దిగుతారని ప్రచారం జరిగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావరడంతో వీఆర్ఎస్ తీసుకున్నారు. ప్రవీణ్ ప్రకాష్ సతీమణి కూడా సివిల్ సర్వీసెస్లో ఉన్నారు. ఇటీవల మరికొందరు అధికారులు కూడా వీఆర్ఎస్ తీసుకోగా.. మరికొందరి సర్వీస్ ముగియడంతో రిటైర్ అయ్యారు.. వీరిలో మాజీ సీఎస్ జవహర్ రెడ్డి కూడా ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa