డ్వాక్రా మహిళలకు జీవనోపాధి కల్పించే దిశగా.. బ్యాంకుల ద్వారా ఇస్తున్న గ్రూప్ రుణాలతోపాటు.. పెద్ద మొత్తంలో వ్యక్తిగత రుణాలను ప్రోత్సహించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా బ్యాంకులతో మాట్లాడి ఒక్కో సభ్యురాలికి రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు రుణంగా అందిస్తారు. డ్వాక్రా సంఘంలో ఒకే సమయంలో.. గరిష్ఠంగా ముగ్గురికి అందిస్తారు. డ్వాక్రా మహిళలు ఇప్పటికే జీవనోపాధి కోసం ఏర్పాటు చేసిన యూనిట్కి, కొత్తగా ఏర్పాటు చేయబోయే యూనిట్లకు కూడా రుణాలు ఇస్తారు.
2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి.. రాష్ట్రవ్యాప్తంగా రూ.2 వేల కోట్ల మేర లక్షన్నర మంది డ్వాక్రా మహిళలకు వ్యక్తిగత రుణాలు అందించాలని సెర్ప్ అధికారులు టార్గెట్గా పెట్టుకున్నారు. వీరిలో 1.35 లక్షల మందికి రూ.లక్ష.. అలాగే 15 వేల మందికి రూ.5 లక్షల రుణాలను అందించాలని భావిస్తున్నారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారుల ఆసక్తి, యూనిట్ ఏర్పాటు వ్యయానికి తగిన విధంగా రుణాన్ని భవిష్యత్తులో రూ.10 లక్షలకు కూడా పెంచుతామంటోంది ప్రభుత్వం.
రాష్ట్రంలో డ్వాక్రా మహిళలకు మరింత మేలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర పథకాలైన పీఎంఎఫ్ఎంఈ (ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం), పీఎంఈజీపీ (ప్రధానమంత్రి ఉద్యోగ కల్పన కార్యక్రమాల్ని) దీనికి అనుసంధానించనున్నారు. అంతేకాదు ఈ పథకం కింద ఎంపిక చేసిన జీవనోపాధి ఏర్పాటు చేసుకున్నవారికి.. తీసుకున్న బ్యాంకు రుణంలో 35 శాతం రాయితీ కూడా వర్తిస్తుంది. అంటే రూ.లక్ష రుణం తీసుకుంటే రూ.35 వేలు రాయితీ కింద మినహాయింపు ఇస్తారు. రుణంలో మిగిలిప మొత్తాన్ని లబ్ధిదారులు నెలవారీ వాయిదాల్లో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.
ప్రభుత్వం 35% రాయితీ వర్తించే.. రూ.లక్ష నుంచి రూ.5 లక్షలతో ఏర్పాటు చేసుకోగలిగే యూనిట్ల వివరాలు ఇలా ఉన్నాయి. కారంపొడి, పసుపు, మసాలా పొడి ప్యాకింగ్ యూనిట్లు ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే బేకరీ, స్వీట్ షాప్, ఐస్క్రీమ్తేనె తయారీ.. అప్పడాల తయారీ, వెజిటబుల్ సోలార్ డ్రయ్యర్, భోజనం (బఫే) ప్లేట్ల తయారీ, డీజే సౌండ్ సిస్టమ్, డెయిరీ, పౌల్ట్రీ.. ఊరగాయల తయారీ, ప్యాకింగ్ యూనిట్లు ఏర్పాటు చేసుకోవచ్చు.ఎన్నికల సమయంలో నారా చంద్రబాబు నాయుడు డ్వాక్రా మహిళల రుణాలకు సంబంధించి ప్రకటన చేశారు. ఇచ్చిన హామీ ప్రకారం డ్వాక్రా మహిళలకు సంబంధించి రుణాలపై నిర్ణయం తీసుకున్నారు.
ఇటీవల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. ప్రధానంగా డీబీటీ పథకాల అమలు, అభివృద్ధికి బ్యాంకర్ల సహాయం అవసరమని తెలిపారు. సబ్సిడీ రుణాలు, వివిధ పథకాల లబ్ధిదారులకు బ్యాంకర్లు సహకరించాలని.. డ్వాక్రా సంఘాల బలోపేతంలో బ్యాంకర్లదే కీలక పాత్ర అన్నారు. వ్యవసాయ రంగం, పరిశ్రమలకు ప్రొత్సాహం, డ్వాక్రా సంఘాల బలోపేతంలో బ్యాంకర్ల పాత్రే కీలకమని తెలిపింది. తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులు ప్రభుత్వం వైపు నుంచి కావాల్సిన సహకారాన్ని బ్యాంకర్లు ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తెచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa