ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం (జులై 22) నుంచి జరగనున్నాయి. ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నట్లు సమాచారం. ఎన్నికల నేపథ్యంలో గత వైసీపీ ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ గడువు పూర్తి కానున్న నేపథ్యంలో మరో మూడు నెలలకు గానూ ఓటాన్ అకౌంట్ ప్రవేశపెట్టే యోచనలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ నెలలో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలిసింది. సోమవారం ఉదయం గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లోనే ఓటాన్ బడ్జెట్తో పాటుగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లును సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలిసింది. అలాగే ఏపీలో శాంతి భద్రతలు, మద్యం, ఆర్థికశాఖలపై శ్వేతపత్రాలు విడుదల చేయనున్నారు.
మరోవైపు అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం చంద్రబాబు పలు సూచనలు చేశారు. సభ్యులు అడిగే ప్రశ్నలకు పూర్తిగా ప్రిపేర్ అయ్యి రావాలని సూచించారు. మరోవైపు అసెంబ్లీ సమావేశాల కోసం టీడీపీ డ్రెస్ కోడ్ కూడా ఫాలో కానుంది. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ పసుపు రంగు దుస్తులు ధరించి పార్టీ కండువాలు మెడలో వేసుకుని రావాలని టీడీఎల్పీ సూచించింది. సోమవారం ఉదయం 8.30 గంటలకు చంద్రబాబు సహా టీడీపీ నేతలు వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద నివాళులర్పించి అసెంబ్లీకి వెళ్తారు.
మరోవైపు ఏపీ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో మరో విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా లేదా అనేది ప్రాధాన్యం సంతరించుకుంది. ఫలితాల తర్వాత ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం సమయంలోనూ వైఎస్ జగన్ సభలో ఉండేందుకు ఇష్టపడలేదు. తన ప్రమాణ స్వీకారం పూర్తికాగానే వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో ఈ సారి సమావేశాలకు ఆయన హాజరవుతారా లేదా అనేది ప్రాధాన్యం సంతరించుకుంది. అలాగే సమావేశాలకు వైసీపీ అధినేత వస్తే సీటు ఎక్కడ కేటాయిస్తారనే దానిపైనా చర్చ నడుస్తోంది.
2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి 11 సీట్లు మాత్రమే వచ్చాయి. దీంతో వైసీపీకి ప్రతిపక్ష హోదా దక్కలేదు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలని వైఎస్ జగన్.. స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడికి లేఖ రాసినా స్పందన లేదు. వైసీపీకి టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రతిపక్ష హోదా ఇచ్చే అవకాశాలు కనిపించడం లేదు. అలాగే ఆ పార్టీ సభ్యులకు అసెంబ్లీలో స్థిరమైన స్థానాలను ఇప్పటి వరకూ కేటాయించలేదు. ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్ శాసనసభకు వచ్చినప్పటికీ మొదటి వరుసలో సీటు దక్కడం కష్టమేనని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. సాధారణ ఎమ్మెల్యేగానే వైఎస్ జగన్.. ఎక్కడో ఓ చోట కూర్చోవాల్సి ఉంటుందంటున్నారు. మరి ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ అసెంబ్లీకి వస్తారా.. వస్తే ఎక్కడ కూర్చుంటారనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa