ఏపీలోని రైతులకు ఖరీఫ్ సీజన్ కోసం సహకార సంఘాల్లో ఎరువులను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఖరీఫ్ సీజన్ కోసం రైతులకు విక్రయించేందుకు 1321 సహకార సంఘాల్లో ఎరువులను సిద్ధం చేశారు. ఖరీఫ్ సీజన్ సన్నద్ధత మీద అధికారులతో ఏపీ వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సమీక్షించారు. ఖరీఫ్ సీజన్ కోసం పూర్తి స్థాయిలో సిద్ధం కావాలని ఆదేశించారు. ఈ సీజన్ కోసం 17.50లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను సిద్ధం చేయాలని అచ్చెన్నాయుడు ఆదేశించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 14 లక్షల టన్నుల ఎరువులు ఉన్నట్లు తెలిపారు. మిగిలిన వాటిని కూడా సకాలంలో రాష్ట్రానికి చేరుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఏపీ వ్యవసాయశాఖ మంత్రి ఆదేశించారు.
అలాగే కల్తీ ఎరువుల కట్టడి కూడా అచ్చెన్నాయుడు చర్యలు ప్రారంభించారు. వీటితో పాటు లైసెన్స్ లేని సహకార సంఘాలకు కూడా పర్మిషన్లు ఇచ్చి ఎరువుల విక్రయాలు జరిగేలా చూడాలని స్పష్టం చేశారు.ఏపీలో భారీ వర్షాల నేపథ్యంలో సాగుపై అల్పపీడన ప్రభావం, పంట నష్టం గురించి కూడా అధికారులతో వ్యవసాయశాఖ మంత్రి చర్చించారు. పంట పొలాల్లో నిలిచిన నీటి తొలగింపుతో పాటుగా, తేమ ద్వారా ఆశించే తెగుళ్ల నివారణపైనా రైతులకు సూచనలు చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. ఉపాధి హామీ పథకం కింద పంట కాలువలు, డ్రెయిన్లలో పూడికతీత చేపట్టి నీటి సరఫరా జరిగేలా చూడాలని ఆదేశించారు. నీటి సంరక్షణకు చర్యలు చేపట్టాలని సూచించారు.
మరోవైపు పొలం పిలుస్తోంది కార్యక్రమంపైనా వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఫోకస్ పెట్టారు. జులై 23 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం చేపట్టనున్నారు. పొలం పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా సాగుకు సంబంధించిన శాస్త్రీయ అంశాలపై రైతులకు అవగాహన కల్పించనున్నారు. అలాగే వ్యవసాయ శాఖ ద్వారా రైతుల పొలాల్లో భూసార పరీక్షలు నిర్వహిస్తారు. ఫలితాల వాటి ఆధారంగా ఏయే పొలాల్లో ఎలాంటి ఎరువులు వాడాలనే దానిపైనా రైతులకు అవగాహన కల్పిస్తారు. జులై 23 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. దీనిపై ఇప్పటికే ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa