టీటీడీ తిరుమల శ్రీవారి సేవ ఆన్లైన్ కోటా విడుదల చేస్తోంది. శనివారం (జులై 27న) ఉదయం 11 గంటలకు తిరుమల – తిరుపతి శ్రీవారి సేవ కోటా అందుబాటులోకి వస్తుంది. అలాగే శ్రీవారి నవనీత సేవ మధ్యాహ్నం 12 గంటలకు.. మధ్యాహ్నం 1 గంటకు పరకామణి సేవ ఆన్లైన్లో విడుదల చేస్తారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి శ్రీవారి సేవ కోటాను బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది. శ్రీవారి సేవలకు టీటీడీ ఉచితంగానే దర్శనంతో పాటూ వసతి కూడా కల్పిస్తోంది.
మరోవైపు అక్టోబర్ నెలకు సంబంధించి టీటీడీ మరో కీలక ప్రకటన చేసింది. అక్టోబర్ 4 నుంచి 12వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అక్టోబర్ 4 నుంచి 10వ తేదీ వరకు సుప్రభాత సేవ మినహా, మిగిలిన అన్ని ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. అలాగే అక్టోబర్ 11, 12వ తేదీల్లో సుప్రభాత సేవతో పాటు అన్ని ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు భక్తుల్ని అలర్ట్ చేశారు. అక్టోబర్ 3 నుంచి 13వ తేదీ వరకు అంగప్రదక్షిణ, వర్చువల్ సేవా దర్శనం టికెట్లు కూడా రద్దు చేస్తున్నట్లు తెలిపారు. కాబట్టి భక్తులు ఈ విషయాన్ని గమనించి టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది. భక్తులు https://ttdevasthanams.ap.gov.in వెబ్సైట్ ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ కోరింది.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.. వీకెండ్ కావడంతో భక్తులు స్వామివారి దర్శనానికి తరలివస్తున్నారు. గురువారం రోజు తిరుమల శ్రీవారిని 61వేల 699మంది భక్తులు దర్శించుకోగా.. 25వేల 082మంది తలనీలాలు సమర్పించారు. తిరుమల శ్రీవారి హుండీకి రూ. 3.55 కోట్లు ఆదాయం వచ్చినట్లు టీటీడీ తెలిపింది. ప్రస్తుతం కంపార్ట్మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి.. తిరుమల టీబీసీ వరకు క్యూలైన్లు కనిపిస్తున్నాయి. ఎస్ఎస్డీ టోకెన్లు లేని భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి 16 నుంచి 18 గంటల సమయం పడుతోంది.
శని, ఆదివారాలు ఉండటంతో ఈ రద్దీ మరింత పెరుగుతుందని టీటీడీ అంచనా వేస్తోంది. రద్దీ ఉండటంతో భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేశారు.. క్యూ లైన్లలో భక్తులకు అన్న ప్రసాదాలు, తాగునీరు అందిస్తున్నారు. సోమవారం వరకు ఈ రద్దీ ఉంటుందని అంచనా వేస్తున్న టీటీడీ.. రద్దీపై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తోంది. రెండు, మూడు నెలల నుంచి ప్రతి వీకెండ్ ఇదే పరిస్థితి కనిపిస్తోంది.. భక్తుల రద్దీ అమాంతం పెరుగుతోంది. సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇస్తూ.. త్వరగా శ్రీవారి దర్శనం పూర్తయ్యేలా టీటీడీ చర్యలు తీసుకుంటోంది. . క్యూ లైన్ల దగ్గర పరిస్థితిని పర్యవేక్షిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa