ఉత్తరాది ప్రజలకు పేరెన్నికగన్న ఆంధ్ర ప్రదేశ్ చేనేత వస్త్రాలను చేరువ చేసేందుకు ఎపి భవన్ ప్రాంగణంలో “సామూహిక” చేనేత వస్త్రాల ప్రదర్శనను ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్ర ప్రదేశ్ భవన్ రెసిడెంట్ కమిషనేర్ ప్రవీణ్ ప్రకాష్ చెప్పారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర చేనేత జౌళిశాఖ ఆధ్వర్యంలో ఆంధ్ర ప్రదేశ్ భవన్, ఇండీకల్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఫిబ్రవరి 1వ తేదీ శుక్రవారం నుంచి ఫిబ్రవరి 3వ తేదీ ఆదివారం వరకు ఎపి భవన్ ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్న చేనేత వస్త్ర ప్రదర్శనను పురస్కరించుకుని ఎపి భవన్ రెసిడెంట్ కమీషనర్ ప్రవీణ్ ప్రకాష్ గురువారం పాత్రికేయులకు వివరించారు. చేనేత వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిచ్చి చేనేత వస్త్రాల తయారీ, ఉత్పత్తిదారులను ప్రోత్సహిస్తోందని చెప్పారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పేరెన్నికగన్న ఉప్పాడ, వేంకటగిరి, ధర్మవరం చీరలు, మంగళగిరి చీరలు,డ్రెస్ మెటీరియల్స్, కాళహస్తి, పెడన కలంకారి వస్త్రాలను ఉత్తరాది ప్రజలకు చేరువచేసే సంకల్పంతో శుక్రవారం నుంచి 3రోజులపాటు చేనేత వస్త్రాల ప్రదర్శన, అమ్మకం కొరకు "సామూహిక" ఎక్సిబిషన్ ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఆంధ్ర ప్రదేశ్ లోని 13 జిల్లాలనుంచి చేనేత వస్త్రాల తయారీ, ఉత్పత్తిదారులు తయారుచేసిన వస్త్రాలతోపాటు ఉత్తరాదిలో బనారస్, కచ్, భాగల్పూర్, ఛత్తీస్ ఘర్ లలో ప్రసిద్ధి చెందిన వస్త్రాలను కూడా ఇక్కడి వస్త్ర ప్రదర్శనలో ఏర్పాటు చేస్తున్నట్లు రెసిడెంట్ కమీషనర్ ప్రవీణ్ ప్రకాష్ పాత్రికేయులకు వివరించారు.
ఉత్తరాదిన ఆంధ్ర ఆప్రదేశ్ చేనేత వస్త్రాలకు బహుళ ప్రచారం కల్పించేందుకు లాభాపేక్ష లేకుండా ఈ వస్త్రాలను ఉత్పత్తి ధరలకే అమ్మకం చేయనున్నట్లు చెప్పారు. ఇదే స్పూర్తితో ప్రతి సంవత్సరం వస్త్రప్రదర్శన ఏర్పాటు చేయుటకు చర్యలు తీసుకుంటామన్నారు. ఢిల్లీలోని తెలుగు, తెలుగేతర ప్రజలు ఈసదవకాశాన్ని సద్వినియోగ పర్చుకొని వస్త్రాలను కొనుగోలు చేసి చేనేత కార్మికులను, ఉత్పత్తిదారులను ప్రోత్సహించాలని ప్రవీణ్ ప్రకాష్ విజ్ఞప్తి చేశారు.
ఆంధ్ర ప్రదేశ్ చేనేత జౌళిశాఖ సంయుక్త సంచాలకులు నాగేశ్వర రావు మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో సుమారు 10 లక్షలమంది చేనేత కార్మికులు చేనేత వస్త్రాల తయారీ రంగంపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారని వీరిని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలతో పాటు చేనేత వస్త్రాల ప్రదర్శన, అమ్మకం చేయుటకు ఎక్సిబిషన్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఎపి భవన్,ఇండికల్ట్ ల సమన్వయంతో ఢిల్లీలో ఏర్పాటు చేస్తున్న ఎక్సిబిషన్ లో రాష్ట్రం నుంచి వచ్చిన 30మంది చేనేత తయారీదారులు తమ ఉత్పత్తులను ప్రదర్సించుటకు అవసరమైన అన్నీ ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.
ఇండికల్ట్ ప్రతినిధులు శ్రీమతి మీను వెంకటేశ్వరన్, శ్రీమతి సారిక కౌల్ భాన్ లు మాట్లాడుతూ అంధ్ర ప్రదేశ్ చేనేత వస్త్రాలతో పాటు ఉత్తరాదిలో పేరెన్నికగన్న బనారస్, కచ్, భాగల్పూర్, ఛత్తీస్ ఘర్ వస్త్రాలను ప్రదర్శనలో ఉంచుతున్నట్లు చెప్పారు. చేనేత ఉత్పత్తులకు బహుళ ప్రాచూర్యం కల్పించుటకు మార్కెటింగ్ సౌకర్యాలను పెంపొందిస్తూ చేనేతకు తమ సంస్థ చేయూత నిస్తున్నట్లు చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa