నల్ల చట్టాలను రద్దు చేసే వరకు పోరుబాట ఆపేది లేదని జాతీయ బార్ కౌన్సిల్ సభ్యులు సుంకర రాజేంద్రప్రసాద్ ప్రతిజ్ఞ చేశారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన చట్టాలకు వ్యతిరేకంగా న్యాయవాదుల ధర్నా చేస్తున్నారని అన్నారు. ఈరోజు ధర్నా చేపట్టామని.. ఈ ఆందోళనకు పెద్ద సంఖ్యలో న్యాయవాదులు పాల్గొన్నారని తెలిపారు. గతంలో ఉన్న చట్టాలను రద్దు చేసి కొత్త చట్టాలు తెచ్చారని అన్నారు. బ్రిటిష్ వాళ్ల చట్టాలను మార్చినట్లు కేంద్రం ప్రకటించిందని తెలిపారు. కానీ 90 శాతం చట్టాలను పాతవే ఉంచి పేర్లు మార్చారని మండిపడ్డారు. మార్చిన చట్టాల వల్ల ప్రజల గొంతుక నొక్కేలా ఉన్నాయని చెప్పారు. పోలీసులు, పాలకులకు అధికారాలు కట్టబెట్టేలా ఉన్నాయని విమర్శించారు. కోర్టు అనుమతితో సంకెళ్లతో బంధించే విధానం తీసేసి పోలీసులకే పవర్ ఇచ్చారని తెలిపారు.ఇక నుంచి పోలీసులు ఎవరినైనా తాళ్లు, గొలుసులతో బంధించవచ్చని చెప్పారు. న్యాయ వ్యవస్థను నీరు గార్చేలా ఈ చట్టాలు ఉన్నాయని ఆరోపించారు. పాలకులు చేసే తప్పులను ప్రశ్నిస్తే కఠిన చర్య ఉండేలా చట్టం చేశారని చెప్పారు. ఉపా యాక్ట్ రద్దు చేయకుండా మళ్లీ అమలు చేస్తున్నారని అన్నారు.రాజకీయ నాయకులపై క్రైం సిండికేట్ ముద్ర వేసే ప్రమాదం ఉందని చెప్పారు. ప్రజా సమస్యల కోసం పని చేసే వారిని అణచి వేసేలా చట్టాలు ఉన్నాయని వివరించారు. పోలీసులకు పరిమితికి మించి అధికారాలు ఇచ్చారని గుర్తుచేశారు. ఇది భవిష్యత్తులో చాలా అనర్ధాలను కలిగిస్తుందని మండిపడ్డారు. ఈ చట్టాలను రద్దు చేసే వరకు తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. రాష్ట్రం, దేశ వ్యాప్తంగా న్యాయవాదులు, ప్రజలు, ప్రజా సంఘాలు కలిసి ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ప్రజాస్వామ్య విరుద్ధంగా ఎవరు నిర్ణయాలు చేసినా అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేసి ఈ నల్ల చట్టాలను రద్దు చేయాలని సుంకర రాజేంద్రప్రసాద్ డిమాండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa