కొందరి అమాయత్వం కేటుగాళ్లకు ఆసారాగా మారుతోంది. మాయ మాటలు చెప్పి నిండా ముంచేస్తున్నారు. సేమ్ టు సేమ్ సినిమా రేంజ్లో అవే సీన్లను రిపీట్ చేస్తున్నారు. తాజాగా చిత్తూరు జిల్లాలో అదే జరిగింది.. ఇంద్ర సినిమాలో ఏవీఎస్ ఫ్యామిలీని బ్రహ్మానందం అండ్ గ్యాంగ్ మోసం చేసే సీన్లాంటిదే ఒకటి జరిగింది. ఓ మహిళ అమాయకత్వాన్ని క్యాష్ చేసుకున్నారు కేటుగాళ్లు. పాపం ఆమె ఆరోగ్యం నయమవుతుందని ఆశపడితే.. ఉన్న బంగారం మొత్తం పోగొట్టుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ నెల 21న చిత్తూరు జిల్లా ఐరాల మండలం నాగంవాండ్లపల్లెకు చెందిన యశోద అనే మహిళ ఇంట్లో ఒక్కరే ఉన్నారు. అక్కడ ఎవరూ లేరనే విషయాన్ని గమనించే.. చిక్కిందిలే అవకాశం అనుకుని.. అదే అదనుగా ఇద్దరు వ్యక్తులు ఆమె ఇంటికి వెళ్లారు. ‘మీరు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే మేం చెప్పినట్లు పూజలు చేయాలి’ అంటూ యశోదకు మాయ మాటలు చెప్పారు. పాపం ఆమె కూడా వారి మాటలు నమ్మింది.. తన దగ్గర ఉన్న 26 గ్రాముల బంగారాన్ని ఓ పెట్టెలో పెట్టి ఆ కేటుగాళ్లు చెప్పినట్లే పూజలో కూర్చొంది.
తాము వెలిగించిన కర్పూరం ఆరిపోయే వరకు కళ్లు తెరవకూడదని.. ఆ ఇద్దరు చెప్పడంతో యశోద అలాగే చేసింది. కళ్లు తెరచి చూస్తే వారు పెట్టెలో బంగారం తీసుకొని రాళ్లు పెట్టి వారిద్దరు అక్కడి నుంచి పారిపోయారు. అప్పుడు మోసపోయానని గమనించిన ఆమె పోలీసుల్ని ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్రజలు మూఢనమ్మకాలు వీడాలని, అపరిచితుల మాయమాటలు నమ్మి మోసపోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ ఊళ్లలో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే డయల్-100, 112, పోలీసు వాట్సప్ నంబరు 94409 00005కు సమాచారం ఇవ్వాలని కోరారు. అమాయకంగా దుండగులు చెప్పిన మాటలు నమ్మి ఇలా మోసపోవద్దని సూచిస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి.. అందుకే అపరిచిత వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు పదే పదే జనాలకు సూచిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa