పాత పెన్షన్ స్కీమ్ పునరుద్ధరించాలని దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్లు చేస్తున్న వేళ.. కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కొత్త పెన్షన్ స్కీమ్కు బదులుగా మరో పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు తెలిపింది. యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ను ప్రారంభించాలని తాజాగా సమావేశం అయిన కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన భేటీ అయిన కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఉద్యోగుల కోసం ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ను కేంద్రం ప్రవేశపెట్టిందని చెప్పారు. దీని వల్ల సుమారు 23 లక్షల మంది ఉద్యోగులు లబ్ధి పొందుతారని అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు. ఇందుకోసం రూ.10,579 కోట్ల వ్యయం అవుతుందని వివరించారు. పారిశ్రామిక, ఐటీ విప్లవాల మాదిరిగా త్వరలో బయో విప్లవం రాబోతోందని కేంద్రమంత్రి చెప్పారు. బయో టెక్నాలజీ, బయో సైన్స్ రంగాల్లో భారీగా ఉపాధి అవకాశాలు ఉన్నాయన్నారు.
ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్న కొత్త పెన్షన్ విధానాన్ని తొలగించి.. తిరిగి పాత పెన్షన్ విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని ఉద్యోగ సంఘాల నుంచి డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే కొత్త పెన్షన్ విధానానికి బదులుగా కొత్తగా ఏకీకృత పెన్షన్ స్కీమ్ ప్రారంభించేందుకు కేంద్రమంత్రి వర్గ సమావేశంలో కొత్త ఏకాభిప్రాయం కుదిరింది. ఎన్పీఎస్ పథకాన్ని మెరుగుపరచాలని దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగుల నుంచి ఎప్పటి నుంచో డిమాండ్ ఉందని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఇందులో సంస్కరణల కోసం ఏప్రిల్ 2023లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డాక్టర్ సోమనాథన్ ఛైర్మన్గా ఒక కమిటీ ఏర్పాటు చేశారన్నారు.
ఈ డాక్టర్ సోమనాథన్ కమిటీ.. దాదాపు అన్ని రాష్ట్రాల్లోని 100కుపైగా ప్రభుత్వ ఉద్యోగుల సంస్థలతో సంప్రదింపులు జరిపిందని అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంస్థలకు కూడా ప్రాధాన్యం ఇచ్చారని తెలిపారు. ఇక ఉద్యోగుల పెన్షన్ అంశాన్ని ప్రధాని మోదీ సీరియస్గా తీసుకున్నారని.. కమిటీ సిఫారసు మేరకు యూనిఫైడ్ పింఛన్ స్కీమ్కు ఆమోదం తెలిపిందని చెప్పారు. ఇక 25 ఏళ్ల సర్వీసు ఉన్న వారికి పూర్తి పెన్షన్ వస్తుందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ యూపీఎస్ స్కీమ్ 2025 ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానుందని అశ్వినీ వైష్ణవ్ స్పష్టం చేశారు. 10 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసిన వారికి రూ.10వేల పెన్షన్ వస్తుందని చెప్పారు. ఉద్యోగులు సర్వీసులో ఉండగా మరణిస్తే వారి భార్యలకు 60శాతం పెన్షన్ ఇస్తారని వెల్లడించారు.
ఉద్యోగుల పెన్షన్లతోపాటు మరో 2 నిర్ణయాలకు కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. బయో ఈ-3 విధానంతోపాటు 11, 12వ తరగతి విద్యార్థులకు ఇంటర్న్షిప్ నిర్వహించే కార్యక్రమానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (డీఎస్టీ) సమీకృత కేంద్ర రంగ పథకం సైన్స్ స్ట్రీమ్లో విలీనమైన 3 ప్రధాన పథకాలను కొనసాగించడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. దేశంలో సైన్స్, టెక్నాలజీ, ఆవిష్కరణలకు సంబంధించిన పర్యావరణ వ్యవస్థను పటిష్టం చేయడం కోసం శాస్త్ర, సాంకేతికతలో సామర్థ్య పెంపుతో పాటు పరిశోధన, ఆవిష్కరణ-సాంకేతిక అభివృద్ధిని ప్రోత్సహించడం.. విజ్ఞాన్ ధార పథకం ప్రాథమిక లక్ష్యం. ఈ పథకం అమలు విద్యాసంస్థల్లో పూర్తిగా సన్నద్ధమైన పరిశోధన, అభివృద్ధి ప్రయోగశాలలను ప్రోత్సహించడం ద్వారా దేశంలోని శాస్త్ర సాంకేతిక మౌలిక సదుపాయాలను బలోపేతం చేయనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa