ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వందేభారత్ ఎక్స్‌ప్రెస్ పై రాళ్ల దాడి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Feb 03, 2019, 11:46 AM

ఢిల్లీ: దేశంలోనే వేగవంతమైన రైలుగా గుర్తింపు పొందిన ట్రైన్ 18 (వందేభారత్ ఎక్స్‌ప్రెస్)పై మరోసారి రాళ్లదాడి జరిగింది. శుక్రవారం రాత్రి ట్రయల్ రన్ జరుపుకుంటున్న సమయంలో ఢిల్లీలో ఈ ఘటన జరిగింది. ఈ దాడిలో రైలు అద్దం పగిలింది. నెల రోజుల కిందట కూడా ఇలాంటి ఘటనే జరిగిన విషయం తెలిసిందే. ఢిల్లీ నుంచి అలహాబాద్‌కు ట్రయల్ రన్ నిర్వహించడానికి వస్తున్న సమయంలో శకుర్‌బస్తీ దగ్గర శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో ఈ దాడి జరిగింది. అయితే ఇందులో ఎవరూ గాయపడలేదు. ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్ కూడా చేయలేదు. ట్రయల్ రన్ సందర్భంగా రైల్లో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది కూడా ఉన్నారు.  ముందు భాగం నుంచి రెండో బోగీ ఈ రాళ్ల దాడిలో దెబ్బతిన్నది. ఢిల్లీ స్టేషన్‌కు వచ్చిన తర్వాత ఈ దాడి ఘటన గురించి ఆర్పీఎఫ్ అధికారులకు సమాచారం అందించారు. ఇప్పటివరకు ఈ ఘటనకు ఎవరు పాల్పడ్డారన్నది తేలలేదు. ఇంతకుముందు డిసెంబర్ 20న ఢిల్లీ, ఆగ్రా మధ్య ట్రయల్ రన్ సందర్భంగా కూడా ఈ రైలుపై రాళ్ల దాడి జరిగింది. ఇది స్వదేశంలో తయారైన తొలి ఇంజిన్ రహిత రైలు కావడం విశేషం. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో ఈ రైలు తయారైంది. ఈ మధ్య గంటలకు 180 కిలోమీటర్ల వేగం అందుకొని వేగవంతమైన రైలుగా గుర్తింపు సాధించింది. దేశంలోని శతాబ్ది రైళ్ల స్థానంలో వీటిని ప్రవేశపెట్టనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa