తెలుగు రాష్ట్రాలకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అండగా నిలిచారు. రెండు రాష్ట్రాల్లో వరద బీభత్సంపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విచారం వ్యక్తం చేశారు. ఏపీ, తెలంగాణలో తాజా పరిస్థితులపై ప్రధాని మోదీకి ఫోన్ చేసి వివరించారు.. వెంటనే ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆయన కూడా తన వంతు సాయంగా వ్యక్తిగత పింఛన్ నుంచి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.5 లక్షల చొప్పున పంపించారు. అలాగే వెంకయ్య కుమారుడు హర్షవర్దన్ నిర్వహిస్తున్న ముప్పవరపు ఫౌండేషన్ తరఫున రెండు రాష్ట్రాలకు రూ.2.5 లక్షల చొప్పున, కుమార్తె దీపా వెంకట్ నిర్వహిస్తున్న స్వర్ణభారత్ ట్రస్ట్ నుంచి కూడా తెలుగు రాష్ట్రాలకు రూ.2.5 లక్షల చొప్పున సాయం అందించారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కుండ పోత వర్షాలు, ఉధృతమైన వరదలతో వాటిల్లుతున్న నష్టం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు వెంకయ్యనాయుడు. ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితిని వివరించి.. వెంటనే ఆదుకోవాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఇప్పటికే మాట్లాడానని.. అక్కడి ప్రభుత్వాల యంత్రాంగాలతో, కేంద్ర అధికారులు టచ్లో ఉన్నారని ప్రధాని తనతో చెప్పారన్నారు. రెండు రాష్ట్రాలకు తగిన సహాయ సహకారాలు అందజేస్తామని ప్రధాని హామీ ఇచ్చినట్లు తెలియజేశారు.
రెండు రాష్ట్రాలకు ఇక తన వంతు సాయంగా.. తన వ్యక్తిగత పెన్షన్ నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 5 లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 5 లక్షలు సహాయ చర్యల నిమిత్తం పంపించినట్లు ప్రకటనలో చెలిపారు. ఈ కష్టకాలంలో ఇబ్బందుల్లో ఉన్న వారిని ఆదుకోవడానికి స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. వరద బాధితులకు సాయం అందించేందుకు యువత కూడా పెద్ద ఎత్తున ముందుకు రావాలన్నారు.
టాలీవుడ్ నిర్మాత అశ్వినీదత్ కూడా ఏపీకి అండగా నిలిచారు.. ఆయన రూ.25 లక్షలు ప్రకటించారు. టాలీవుడ్ నిర్మాత బన్నీవాసు ఆయ్ సినిమాలో 25శాతం షేర్ను సాయంగా ప్రకటించారు. ఏపీలోని వరదల్లో నిరాశ్రయులైన వారికి భరోసా కల్పించేందుకు సినిమా వసూళ్లలో 25 శాతం విరాళంగా అందించాలని ఆయ్ టీం నిర్ణయించింది. సోమవారం నుంచి వీకెండ్ వరకు వచ్చిన మూవీ షేర్స్లో 25 శాతాన్ని జనసేన పార్టీకి విరాళంగా అందించనున్నారు. ఆయ్ సినిమాకు వచ్చే షేర్లలో 25 శాతం అంటే తక్కువ మొత్తమే వస్తుందని అంచనా వేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా ఏపీకి రూ.50 లక్షలు విరాళం ప్రకటించారు. విజయవాడ వరద బాధితులకు దివీస్ సంస్థ చేయూతను అందించింది. అక్షయపాత్ర ద్వారా రోజూ 1.70లక్షల మందికి ఆహారం అందిస్తున్నట్లు దివీస్ ఎండీ మురళీకృష్ణ తెలిపారు. సుమారు రూ.2.5కోట్ల అంచనా వ్యయంతో ఐదు రోజులపాటు ఈ సాయం కొనసాగుతుందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa