తెలుగు రాష్ట్రాలను వాన గండం వీడిండి. వర్షాలు తగ్గుముఖంపట్టడంతో వరద కూడా తగ్గుముఖం పట్టింది. ఈ క్రమంలో విజయవాడ-హైదరాబాద్ నేషనల్ హైవేపై రాకపోకలు పునరుద్ధరణ చేశారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరం వద్ద జాతీయ రహదారిపై మునేరుకు వరద తగ్గడంతో సోమవారం రాత్రి ఏడు గంటలకు వాహనాలు, జనం రాకపోకలను తిరిగి అనుమతిచ్చారు. మునేరు ఉప్పొంగటంతో జాతీయ రాహదారిపై వరద నీరు ఉద్ధృతంగా ప్రవహించింది. వెంటనే అధికారులు ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఈ నేషనల్ హైవేపై రాకపోకలను నిలిపివేశారు. ఇప్పుడు వరద పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి.. గత 30 గంటలుగా వాహనాలు ఆగిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు.
విజయవాడ-హైదరాబాద్ జాతీయరహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో.. అత్యసవరంగా వెళ్లానుకునేవారికి ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లాలనుకుంటే గుంటూరు, పిడుగురాళ్ల, మిర్యాలగూడ, నల్గొండ, నార్కెట్పల్లి, చిట్యాల, చౌటుప్పల్ మీదుగా ప్రయాణించాలని సూచించారు. కొందరు అదే మార్గంలో వాహనాల రాకపోకలు కొనసాగాయి. దీంతో ఆ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది.
విజయవాడ-హైదరాబాద్ నేషనల్ హైవేపై ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలంలోని గరికపాడు పాలేటి వంతెన దగ్గర ఆదివారం రాత్రి రోడ్డు వరదకు కొట్టుకుపోయింది. అయితే రెండ్రోజుల్లో పూర్తిస్థాయిలో పునరుద్ధరించేందుకు కృషి చేస్తామని ఎన్హెచ్ఏఐ అధికారులు తెలిపారు. సోమవారం మధ్యాహ్నం కోతకు గురైన రోడ్డును అధికారులు పరిశీలించారు. అప్పటి వరకు ఆ పక్కనే ఎడమ వైపు ఉన్న కొత్త వంతెనను వినియోగించేందుకు టెక్నికల్ టీమ్ పరిశీలించింది. ఆ వంతెనపై విడతల వారీగా ఇరువైపులా వాహనాలను నడపవచ్చని ఆ టీమ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ వెంటనే సోమవారం సాయంత్రం 4 గంటల నుంచి గరికపాడు వద్ద ఎడమ వైపు ఉన్న పాలేటి వంతెన పైనుంచి ఇరువైపులా వాహనాల రాకపోకలకు అనుమతించారు.
మరోవైపు తెలంగాణ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి ఎన్టీఆర్ జిల్లా గరికపాడు దగ్గర కోతకు గురైన రహదారిని పరిశీలించారు. ఇరు రాష్ట్రాల అధికారులతో మాట్లాడి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూస్తామన్నారు. అలాగే ఏపీ, తెలంగాణ వరదల దృష్ట్యా ప్రజలకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొన్ని సూచనలు చేశారు. చిల్లకల్లు, నందిగామలో జాతీయ రహదారి 65పై వరద, ఏపీ-తెలంగాణ సరిహద్దు రామాపురం క్రాస్ వద్ద బ్రిడ్జి కూలిపోయింది. సూర్యాపేట, ఖమ్మం రహదారిపై పాలేరు పొంగటం వంటి ఘటనల దృష్ట్యా నగర ప్రజలు జర్నీలను వాయిదా వేసుకోవాలని సూచించారు. ఒకవేళ ఏదైనా అత్యవసరం పరిస్థితిల్లో వెళ్లాలనుకుంటే విజయవాడ వెళ్లేవారు చౌటుప్పల్, నార్కెట్పల్లి, నల్గొండ, పిడుగురాళ్ల, గుంటూరు మీదుగా వెళ్లాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa