ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముంబై నటి కేసులో కీలక మలుపు.. ఎఫ్ఐఆర్‌లో వైసీపీ నేత పేరు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 14, 2024, 07:11 PM

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపుతున్న ముంబై నటి కాదంబరి జత్వానీ కేసులో కీలక పరిణామం సంభవించింది. జత్వానీ ఫిర్యాదు మేరకు ఇబ్రహీంపట్నం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తనను నిర్బంధించి, చిత్ర హింసలు పెట్టారంటూ తల్లిదండ్రులతో కలిసి కాదంబరి జత్వానీ శుక్రవారం ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. శనివారం మరోసారి ఆమె పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. ఎఫ్ఐఆర్ కాపీ కోసమే ఆమె పోలీస్ స్టేషన్ వచ్చినట్లు తెలిసింది. అలాగే కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు కూడా ఆమె పోలీసులకు సమర్పించేందుకు వచ్చినట్లు సమాచారం. మరోవైపు జత్వానీ ఫిర్యాదు మేరకు వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్, మరికొందరిపై ఇబ్రహీంపట్నం పోలీసులు 192, 211, 218, 220, 354, 467, 420, 469, 471, రెడ్‌విత్‌ 120బి సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు.


మరోవైపు కాదంబరి జత్వానీ కేసులో ఇప్పటికే ఇద్దరు పోలీసులపై సస్పెన్షన్ వేటు పడింది. విజయవాడ ఏసీపీగా పనిచేసిన హనుమంతరావు, అప్పటి ఇబ్రహీంపట్నం సీఐ సత్యనారాయణలను సస్పెండ్ చేశారు. కాదంబరి జత్వానీ కేసు తర్వాత జరిగిన బదిలీలలో హనుమంతరావును కాకినాడ డీఎస్పీగా నియమించారు. అయితే జత్వానీ పోలీసు కస్టడీలో ఉన్న సమయంలో హనుమంతరావు మళ్లీ ప్రత్యేకంగా విజయవాడ వచ్చి ఇంటరాగేషన్‌లో పాలుపంచుకున్నారు. అలాగే అప్పట్లో సీఐగా ఉన్న సత్యనారాయణ జత్వానీ కేసు పూర్తిగా పరిశీలించకుండానే ఆమెను అరెస్ట్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులోమరో ముగ్గురు ఐపీఎస్‌లు కూడా ఈ కేసులో కీలకంగా వ్యవహరించారనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వారిపైనా త్వరలోనే చర్యలుత తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


మరోవైపు తాను, తన కుటుంబం ఎలాంటి తప్పు చేయలేదని కాదంబరి జత్వానీ చెప్తున్నారు. అయినా కూడా 42 రోజులు తాము నరకం అనుభవించామని చెప్తున్నారు. దీనికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. తాజాగా ఆమె ఫిర్యాదు మేరకు ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేయడం.. ఎఫ్ఐఆర్‌లో వైసీపీ నేత పేరును ప్రస్తావించడంతో కేసు కీలక మలుపు తిరిగింది. ఇక ఇద్దరు పోలీసులను సైతం సస్పెండ్ చేయడంతో విచారణ వేగవంతమైందని చెప్పవచ్చు. మరి ముందు ముందు ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందనేదీ చూడాలి మరి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa