ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ.. రాయలసీమలో ఏర్పాటు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 14, 2024, 07:34 PM

ఏపీకి రైల్వేశాఖ తీపికబురు చెప్పింది.. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు సానుకూలంగా స్పందించింది. చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కలిశారు. చిత్తూరు పార్లమెంట్‌ పరిధిలోని తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్న పాకాల రైల్వేస్టేషన్‌ (జంక్షన్‌)ను అభివృద్ధి చేయడంతో పాటు, రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ ఇక్కడ ఏర్పాటు చేయాలని కోరారు. అయితే రైల్వేశాఖ మంత్రి సానుకూలంగా స్పందించారని.. హామీ ఇచ్చారని ఎంపీ ప్రసాదరావు తెలిపారు. వచ్చే ఏడాది మార్చి నుంచి పాకాల రైల్వేస్టేషన్‌ను ఆధునికీకరించడంతో పాటుగా పరిసర ప్రాంతాల్లో ఎనిమిది లైన్ల రైల్వేలైన్లతో పాటుగా కోచ్‌ ఫ్యాక్టరీని నిర్మించేందుకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చినట్లు చెప్పారు.


ఈ నెల 9న దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో నిర్వహించిన రైల్వేభద్రతా కమిటీ సమావేశంలో.. పాకాల రైల్వేస్టేషన్‌కు సంబంధించిన పనులకు ఆమోదం లభించిందని తెలిపారు. ఈ మేరకు గుంతకల్‌ డివిజన్‌ కార్యాలయానికి ఉత్తర్వులు వచ్చాయని.. త్వరలో పనులు ప్రారంభం అవుతాయన్నారు. మొగిలి ఘాట్‌రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాద ఘటన దిగ్భ్రాంతికరమన్నారు. ఈ ప్రమాదం బాధాకరమని, ఏడుగురు మరణించడం, 30 మందికి పైగా గాయపడటం తనను తీవ్రంగా కలచివేసిందని ఎంపీ ప్రసాదరావు ఆవేదన వ్యక్తం చేశారు.


చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం మొగిలి ఘాట్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు చనిపోగా, 30మందికిపైగా గాయపడ్డారు. అలిపిరి డిపోకు చెందిన ఆర్టీసీ సప్తగిరి బస్సు సుమారు 45 మంది ప్రయాణికులతో మధ్యాహ్నం తిరుమల నుంచి బెంగళూరుకు వెళుతోంది. అయితే మొగిలి ఘాట్‌ దగ్గరకు రాగానే.. బెంగళూరు నుంచి బంగారుపాళ్యం వెళుతున్న ట్రాలీ అదుపు తప్పి డివైడర్‌ను దాటి, ఇవతలి వైపునకు వచ్చి బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు ఒక్కసారిగా వెనక్కి మళ్లింది. ఆ వెనకాలే చిత్తూరు నుంచి పలమనేరుకు వెళ్తున్న లారీ.. బస్సు ముందు భాగాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌ సహా మరో ఐదుగురు ప్రయాణికులు చనిపోయారు. ట్రాలీ డ్రైవర్ కూడా ప్రమాదంలో చనిపోయారు.‌


గాయపడిన వారిలో 25 మందిని పలమనేరు ప్రాంతీయ ఆసుపత్రికి.. తీవ్రగాయాలైన ఏడుగురిని చిత్తూరులోని జిల్లా వైద్యశాలకు, పరిస్థితి విషమంగా ఉన్న ఒకరిని వేలూరు సీఎంసీకి తరలించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఈ ప్రమాదంపై గవర్నర్‌ జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలందించాలని ఆదేశించారు. ఈ ప్రమాదంలో గాయపడినవారికి మెరుగైన చికిత్స అందించాలని, మృతుల కుటుంబాలను ఆదుకోవాలని మాజీ సీఎం జగన్‌ ప్రభుత్వాన్ని కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa