గణేశ్ నిమజ్జనం సందర్భంగా శోభాయాత్రలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కీర్తిస్తూ పాటలు పెట్టి... ఎదుట వారిని రెచ్చగొట్టేలా ప్రవర్తించారు. విస్తుగొలిపే ఈ ఘటన అన్నమయ్య జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది. దీనిపై ఫిర్యాదు అందడంతో పోలీసులు కేసు నమోదుచేశారు. వివరాల్లోకి వెళ్తే.. బి.కొత్తకోట మండల కేంద్రంలోని వివిధ ప్రాంతాల్లో వినాయక విగ్రహాలను ఏర్పాటుచేసి నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో స్థానిక పోకనాటివీధిలో ఏర్పాటు చేసిన గణనాథుడి విగ్రహాన్ని సెప్టెంబరు 13న నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ చేపట్టిన ఊరేగింపు స్థానిక జ్యోతి బస్టాండుకు చేరుకుంది.
సాంస్కృతిక కార్యక్రమాల స్థానంలో డీజే సౌండ్ బాక్సుల నుంచి ‘కావాలి జగన్... రావాలి జగన్’ అంటూ పాటలు ప్రారంభమయ్యాయి. అనంతరం కొద్దిసేపటికి వైసీపీ జెండాలను ఊరేగింపు వాహనాలపై కొందరు ప్రదర్శించారు. దీంతో భక్తులు విస్తుపోయారు. ఈ విషయాన్ని గుర్తించిన టీడీపీ నేతలు.. అప్పటికప్పుడే పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు.ఆధ్యాత్మిక కార్యక్రమంలో రాజకీయ పార్టీ జెండాలను ప్రదర్శించడంతో పాటు మాజీ సీఎంను కీర్తిస్తూ పాటలను వెంటనే నిలిపివేయాలని పోలీసులను కోరారు.
అయితే, వారు స్పందించకపోవడంతో చివరకు దీనిపై అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడుకు టీడీపీ నాయకులు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో మదనపల్లె డీఎస్పీ కొండల నాయుడు, ఇంఛార్జి సీఐ రాజా రమేష్లు శనివారం బి.కొత్తకోటకు చేరుకుని ఉత్సవ కమిటీ సభ్యులతో మాట్లాడారు. ఊరేగింపు సందర్భంగా పార్టీల ప్రస్తావన తీసుకు రావడానికి కారణాలపై ఆరాతీశారు. ఈ సందర్భంగా డీఎస్పీ, సీఐలు మాట్లాడుతూ.. గణేశ్ నిమజ్జనం ఊరేగింపు సందర్భంగా నిబంధనలను ఉల్లంఘించినవారిని గుర్తించి చట్టపరంగా విచారిస్తామని తెలిపారు.
భక్తి భావనతో నిర్వహించాల్సిన కార్యక్రమంలో రాజకీయ పార్టీల ప్రస్తావన రావడం తీవ్ర విచారకరమని, ఇలాంటి తప్పులు జరగకుండా కమిటీలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచించారు. ఇక, ఎటువంటి అశ్లీల, అసభ్య నృత్యాలు, పాటలు.. రాజకీయ పార్టీల జెండాలు లేకుండా గణేశ్ ఉత్సవాలను నిర్వహించుకోవాలని పోలీసులు చెబుతున్నా ఉత్సవ కమిటీలు మాత్రం వినిపించుకోవడం లేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa