ఏపీ మంత్రివర్గ సమావేశం రేపు (బుధవారం) జరుగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగనున్న ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు కేబినెట్ సమావేశం జరుగనుంది. కేబినెట్లో కొత్త మద్యం పాలసీకి మంత్రివర్గం ఆమోద ముద్ర వేయనుంది. వచ్చే నెల 1వ తేదీ నుంచి రాష్ట్రంలో కొత్త ఎక్సైజ్ పాలసీ అమలుపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. మద్యం పాలసీపై తమ ప్రతిపాదనలను కేబినెట్ ముందు మంత్రివర్గ ఉపసంఘం ఉంచనుంది. ఉపసంఘం ప్రతిపాదనలపై కేబినెట్లో చర్చ జరుగనుంది. అనంతరం నూతన మద్యం పాలసీకి మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. విజయవాడలోని అజిత్ సింగ్ నగర్, జక్కంపూడి, వాంబే కాలనీ, కండ్రిక, వైఎస్ఆర్ కాలనీ, నందమూరి నగర్, రాజరాజేశ్వరి పేట, భవానీ నగర్, ఊర్మిళానగర్తో పాటు రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో ఏర్పడ్డ వరద నష్టంపైనా సమావేశంలో చర్చకు రానుంది. వరదసహాయం, పంటనష్టంకు ఇచ్చే పరిహరంపై కేంద్రం నుంచి అందే సహాయంపైనా కేబినెట్లో చర్చించనున్నారు. ఈ నెల 20వ తారీకుతో కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు కానుండడంతో ఈ అంశంపై మంత్రివర్గ సమావేశంలో ప్రస్తావనకు రానుంది. వివిధ శాఖలు తమ వందరోజుల ప్రణాళికల ఫలితాలపైనా సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. వివిధ మంత్రిత్వ శాఖలు ఇచ్చే నివేదికలపైన కూడా చర్చ జరుగనుంది.వరద బాధితులకు సహాయంపై రేపు కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. వంద రోజుల పాలనలో మంత్రుల గ్రాఫ్ను వారికి ముఖ్యమంత్రి చంద్రబాబు అందించనున్నారు. జనసేన మంత్రుల గ్రాఫ్ను డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్కు సీఎం ఇవ్వనున్నారు. వరద సహయక చర్యలలో ముఖ్యమంత్రి, మంత్రులు పనిచేసిన తీరును కేబినెట్ అభినందించనుంది. వరద సమయంలో అధికారులు పనితీరుపైనా కేబినెట్లో చర్చించి.. వారిని మంత్రి మండలి అభినందించనుంది. బుడమేరు గండ్లు పూడ్చడంలో మంత్రి రామానాయుడు, లోకేష్, అధికారులు చేసిన కృషిపై కేబినెట్లో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa