ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఏపీ, తెలంగాణలో చాలా ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. ముఖ్యంగా తెలంగాణలో ఖమ్మం, ఆంధ్రప్రదేశ్ లోని విజయ వాడ ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి.ఎంతో మంది ప్రాణాలు కోల్పోయాడు. లక్షలాది మంది నిరాశ్రయులై రోడ్డున పడ్డారు. వరద బాధితులను ఆదుకునేందుకు ఇరు ప్రభుత్వాలు పలు చర్యలు చేపడుతున్నాయి .అదే సమయంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కూడా వరద బాధితులకు అండగా నిలిచారు. రెండు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్స్ కు తమ వంతుగా విరాళాలు ప్రకటించారు. ఇక టాలీవుడ్ నుంచి కూడా పలువురు సినీ ప్రముఖులు వరద బాధితుల కోసం భారీగా విరాళాలు ప్రకటించారు. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్, మహేశ్ బాబు, అల్లు అర్జున్, బాలకృష్ణ, నాగార్జున, విక్టరీ వెంకటేశ్, సిద్దూ జొన్నల గడ్డ, విశ్వక్ సేన్.. తదితరులు ఇరు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్స్ కు విరాళాలు ప్రకటించారు. ఇప్పుడు వీరు ముఖ్యమంత్రులను కలిసి తాము ప్రకటించిన విరాళాలను చెక్ రూపంలో అందజేస్తున్నారు. కాగా మన తెలుగమ్మాయి, నటి అనన్య నాగళ్ల రెండు తెలుగు రాష్ట్రాలకు 2.5 లక్షల చొప్పున మొత్తం 5 లక్షల రూపాయలు వరద బాధితులకు విరాళంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో బుధవారం (సెప్టెంబర్ 18) ఉదయం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుని కలిసిన అనన్య నాగళ్ళ 2.5 లక్షల రూపాయల చెక్కుని అందచేసింది.
ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది అనన్య నాగళ్ల.'మన గౌరవనీయులైన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసే అవకాశం వచ్చింది. వరద సాయం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి నా విరాళంగా 2.5 లక్షలు అందజేశాను. మిమ్మల్ని ప్రత్యక్షంగా చూసినందుకు చాలా ఆనందంగా ఉంది. మీ ఆతిథ్యానికి చాలా ధన్యవాదాలు. నేను ఈ క్షణాలను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను' అని అనన్య ట్వీట్ చేసింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు నటి అనన్య నాగళ్లను ప్రత్యేకంగా అభినందించారు. ఇక త్వరలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలిసి చెక్ అందచేయనున్నట్లు తెలిపింది అనన్య. ప్రస్తుతం చంద్రబాబు, అనన్య కలిసి దిగిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో నెట్టింట వైరలవుతున్నాయి. అభిమానులు, నెటిజన్లు తెలుగు హీరోయిన్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa