ఏపీలో కొత్త పింఛన్లపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. టీడీపీ కూటమి ప్రభుత్వానికి వంద రోజులు పూర్తైన సందర్భాన్ని పురస్కరించుకుని ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం చేపడుతున్నారు. ఇందులో భాగంగా ప్రకాశం జిల్లా నాగులప్పలపాడు మండలం మద్దిరాలపాడు గ్రామంలో జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీలో కొత్త పింఛన్లు గురించి చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. అక్టోబర్ నెలలో గ్రామసభలు ఏర్పాటు చేసి అర్హులైన వారికి పింఛన్లు అందిస్తామని ప్రకటించారు. అక్టోబర్ నెల మొత్తం ఇదే కార్యక్రమం ఉంటుందంటూ పింఛన్లకు అర్హులైన వారికి గుడ్ న్యూస్ వినిపించారు. మరోవైపు ప్రతి నెలా ఒకటో తేదీ పేదల సేవలో పేరిట కార్యక్రమం నిర్వహిస్తామన్న సీఎం.. కలెక్టర్ల దగ్గర నుంచి ఎమ్మెల్యేల వరకూ ప్రతి ఒక్కరూ పేదల ఇంటివద్దకు వెళ్లి వారి కష్టాలు తెలుసుకుని సాయం చేయాలని సూచించారు.
టీడీపీ కూటమి ప్రభుత్వం వంద రోజుల పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించిన చంద్రబాబు.. పనిచేసే ప్రభుత్వానికి ప్రజల ఆశీస్సులు తప్పక ఉంటాయన్నారు. వైసీపీ పాలనతో జనం విసిగిపోయి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారన్న చంద్రబాబు.. వైసీపీని భూస్థాపితం చేయాలని ప్రజలు నిర్ణయించుకున్నారని అన్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట ప్రకారం పింఛన్లను నాలుగు వేలకు పెంచిన విషయాన్ని గుర్తు చేశారు. పేదల పట్ల ఉదారంగా ఉంటామన్న చంద్రబాబు.. ఉద్యోగులను సైతం విస్మరించమని చెప్పారు. అయితే తప్పు చేసిన అధికారులను వదిలి పెట్టే ప్రసక్తేలేదన్న చంద్రబాబు తాటతీస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు.
మరోవైపు ప్రకాశం జిల్లా పర్యటనలో చంద్రబాబు నాయుడు మరోసారి తిరుపతి లడ్డూ అంశాన్ని ప్రస్తావించారు. వైఎస్ జగన్ ప్రభుత్వం హయాంలో శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ చేశారని మరోసారి ఆరోపించారు. తిరుమల ప్రసాదంలో ఇష్టానుసారం పదార్థాలు వాడారన్న చంద్రబాబు.. భక్తుల మనోభావాలను దెబ్బతీశారని మండిపడ్డారు. వైసీపీ పాలనలో తిరుమల శ్రీవారి దర్శనం, భోజనాలు ఇలా ఏ విషయంలోనూ సరిగా వ్యవహరించలేదన్న సీఎం.. తాము అధికారంలోకి వచ్చాక తిరుమలలో ప్రక్షాళన చేపట్టినట్లు వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa