వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే సోలార్ పవర్ పీపీఏలను రద్దు చేయడం వల్ల రాష్ట్రంతో పాటు దేశం కూడా నష్టపోయిందని ఏపీ మంత్రి నారా లోకేశ్ మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల మన దేశానికి చెడ్డ పేరు వచ్చిందని విమర్శించారు. ప్రభుత్వాలు మారినా పాలన మారకూడదని చెప్పారు. 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని అన్నారు. వైసీపీ పాలనలో పారిశ్రామిక రంగం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొందని... తమ ప్రభుత్వం పరిశ్రమలకు అన్ని విధాలుగా సహకారం అందించేందుకు సిద్ధంగా ఉందని లోకేశ్ చెప్పారు. ప్రభుత్వం, పారిశ్రామికవేత్తలకు మధ్య సంప్రదింపుల కోసం ఒక ఫోరంను ఏర్పాటు చేస్తామని తెలిపారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను వారంలోగా విడుదల చేస్తామని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం మాదిరి రహస్య జీవోలను తాము ఇవ్వమని... ప్రతి అంశాన్ని ప్రజల ముందు ఉంచుతున్నామని లోకేశ్ తెలిపారు. హౌస్ అరెస్టులు, గేట్లకు తాళ్లు కట్టడం వంటివి తమ ప్రభుత్వంలో ఉండవని అన్నారు. చంద్రబాబు పరదాలు కట్టుకుని తిరిగే ముఖ్యమంత్రి కాదని చెప్పారు. తిరుమల లడ్డూ విషయంలో అపవిత్ర పదార్థాలు కలిపిన వ్యవహారంలో తాము విసిరిన సవాల్ ను వైసీపీ నేతలు ఎందుకు స్వీకరించలేదని ప్రశ్నించారు. తాను 24 గంటల పాటు తిరుపతిలోనే ఉన్నానని... కానీ వైసీపీ నేతలు చర్చకు రాలేదని ఎద్దేవా చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa