అనంతపురం జిల్లాలో రామాలయంలో రథానికి నిప్పు పెట్టిన ఘటన కలకలం రేపింది. కనేకల్ మండలం హనకనహాల్లో రామాలయం ఉంది.. అక్కడ మంగళవారం అర్ధరాత్రి రాముడి రథానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. అర్ధరాత్రి ఈ ఘటన జరగ్గా.. స్థానికులు గమనించి మంటల్ని ఆర్పేశారు. కానీ అప్పటికే రథం సగానికి పైగా కాలిపోయింది. పుణ్యతిథులు, ఉత్సవాల సమయంలో రాములవారిని రథంపై ఊరేగిస్తుంటారు. మిగతా సమయంలో ఓ షెడ్డులో రథాన్ని భద్రపరుస్తారు.
రథానికి నిప్పు పెట్టారనే సమాచారం అందుకున్న కళ్యాణదుర్గం డీఎస్పీ రవిబాబు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్రిమినల్ కేసు నమోదు చేసి.. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ సాయంతో ఆధారాలు సేకరించి నిందితులను పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఘటనా స్థలంలో పలు ఆధారాలు దొరికినట్లు చెబుతున్నారు.. వాటి ఆధారంగా నిందితుల కోసం గాలింపు మొదలు పెట్టారు. ఘటనాస్థలం దగ్గర బీజేపీ, భజరంగ్ దళ్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. రథానికి నిప్పు పెట్టిన దుండగులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పోలీసులు గ్రామస్థులతో మాట్లాడి వివరాలు సేకరిస్తున్నారు. ఘటన జరిగిన ప్రాంతానికి సమీపంలో ఉన్న సీసీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లాలని ఆదేశాలు జారీచేశారు. అధికారులతో మాట్లాడి ఘటనపై వివరాలు తెలుసుకున్నారు. ఆగంతకులు నిప్పు పెట్టడంతో రథం కాలిపోయినట్లు జిల్లా అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి నిందితులను వెంటనే అరెస్టు చేయాలని సీఎం ఆదేశించారు.. దర్యాప్తు వివరాలను ఎప్పటికప్పుడు తనకు తెలియజేయాలని సూచించారు. నిందితులను వీలైనంత త్వరగా పట్టుకుని శిక్షించాలని పోలీసుల్ని ఆదేశించారు. ఇలాంటి అరాచకాలకు పాల్పడేవారిని తమ ప్రభుత్వం వదిలిపెట్టబోదని చంద్రబాబు హెచ్చరించారు. స్వయంగా ముఖ్యమంత్రి రంగంలోకి దిగి ఆదేశాలు ఇవ్వడంతో.. అధికారులు, పోలీసులు ఈ ఘటనను సీరియస్గా తీసుకున్నారు. ఈ రథం దగ్థం ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa