తిరుమల లడ్డూ అపవిత్రం వివాదం నడుస్తున్న వేళ.. ఆంధ్రప్రదేశ్లో జరిగిన మరో ఘటన రాష్ట్రవ్యా్ప్తంగా సంచలనం రేపింది. తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడకంపై హిందువులు ఆందోళన వ్యక్తం చేస్తున్న సమయంలో.. ఈ ఘటన జరగడంతో కలకలం రేగింది. అనంతపురం జిల్లా కణేకల్లు మండలం హనకనహాళ్లో రాములోరి రథానికి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడం.. ఈ ఘటనలో రాములవారి రథం దెబ్బతినడం తెలిసిందే. భక్తుల మనోభావాలతో ముడిపడిన సున్నితమైన ఈ అంశాన్ని ఏపీ ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకుంది. సీఎం చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఈ ఘటనపై సమగ్రంగా దర్యాప్తు జరపాలని పోలీసులను ఆయన ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. 24 గంటల్లోగా నిప్పుపెట్టిన వ్యక్తి ఎవరో కనిపెట్టారు. అతణ్ని అరెస్ట్ చేశారు.
అసలు వివరాల్లోకి వెళ్తే.. కణేకల్లు మండలం హనకనహాళ్లోని రాముల వారి రథానికి సోమవారం అర్ధరాత్రి దుండగులు నిప్పుపెట్టారు. రథం ఉన్న షెడ్డులో నుంచి మంటలు, పొగ రావటంతో స్థానికులు గుర్తించారు. వెంటనే మంటలు ఆర్పివేయగా.. అప్పటికే రథం కొంచెం దెబ్బతింది. దీనిపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిరుమల వివాదం నడుస్తున్న తరుణంలోనే ఈ ఘటన జరగటంతో సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. సమగ్రంగా దర్యాప్తు జరపాలని ఆదేశించడంతో.. మంగళవారం జిల్లా కలెక్టర్, ఎస్పీ కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించారు. స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇక కేసును సీరియస్గా తీసుకున్న అనంతపురం పోలీసులు 24 గంటల్లో నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ వివరాలను అనంతపురం ఎస్పీ జగదీష్ వెల్లడించారు.
ఈశ్వర్రెడ్డి అనే వ్యక్తి రాములవారి రథానికి నిప్పుపెట్టినట్లు అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ తెలిపారు. 23వ తేదీ ఆలయ రథానికి నిప్పుపెట్టారని తెలిపారు. గ్రామస్థులు ఇచ్చిన ఫిర్యాదుతో 24 గంటల్లో నిప్పుపెట్టిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఎర్రిస్వామిరెడ్డి సోదరులు ఈ రథాన్ని చేయించారన్న పోలీసులు.. 20 లక్షలు ఖర్చుచేసి రెండేళ్ల కిందట ఈ రథం చేయించారని తెలిపారు. అయితే ఈ విషయంలో అన్నాదమ్ముళ్ల మధ్యన గొడవలు ప్రారంభమయ్యాయని.. ఈ క్రమంలోనే ఎర్రిస్వామిరెడ్డి కొడుకు ఈశ్వర్రెడ్డి రథానికి నిప్పుపెట్టినట్లు గుర్తించామన్నారు. అతన్ని అరెస్ట్ చేశామని.. ఆయన కూడా విచారణలో నేరం అంగీకరించినట్లు ఎస్పీ వెల్లడించారు. ఈశ్వర్రెడ్డి వైసీపీ కార్యకర్త అయినప్పటికీ.. ఈ ఘటనలో కుటుంబ వివాదమే తప్ప రాజకీయ కోణం లేదని పోలీసులు స్పష్టం చేశారు. ఈశ్వర్రెడ్డికి ఎవరు సహకరించారనే దానిపై దర్యాప్తు జరుపుతున్నట్లు వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa