ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ విశాఖపట్నంలో ఓ వ్యక్తికి క్షమాపణలు చెప్పారు. తప్పు జరిగిందని ఒప్పుకుంటూనే.. మరోసారి ఇలా జరగకుండా చూసుకుంటానని హామీ ఇచ్చారు. సామాన్యుడు చేసిన ట్వీట్కు స్పందించి సారీ చెప్పి పెద్ద మనసు చాటుకున్నారు. మంత్రి నారా లోకేష్ విశాఖపట్నంలో పర్యటిస్తున్నారు.. అయితే మంత్రి కాన్వాయ్లోని వాహనం రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారును ఢీకొట్టి వెళ్లింది. అదే సమయంలో అక్కడే ఉన్న కారు యజమాని కళ్యాణ్ ఈ విషయాన్ని గమనించారు. ఈ విషయాన్ని భరద్వాజ్ ఎక్స్ (ట్విట్టర్) ద్వారా లోకేష్ దృష్టికి తీసుకొచ్చారు.
'లోకేష్ గారూ.. నాకు మీ పరిపాలన, టీడీపీ అంటే ఇష్టం. రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని తిరిగి అధికారంలోకి తీససుకొచ్చినందుకు గర్వంగా ఉంది. అయితే, ఇవాళ విశాఖపట్నంలో తాటిచెట్లపాలెం హైవే దగ్గర మీ కాన్వాయ్ వెళ్లేందుకు మా కారును రోడ్డు పక్కన ఆపారు. అయితే మీ కాన్వాయ్లోని ఓ వాహనం నా కారును ఢీకొట్టి వేగంగా వెళ్లిపోయింది'అంటూ ట్వీట్ చేశారు. తన కారుకు డ్యామేజ్ అయిన ఫోటోలను కూడా పోస్ట్ చేశారు.
ఈ ట్వీట్ గమనించిన వెంటనే లోకేష్ స్పందించారు. 'మీకు నా క్షమాపణలు. నేను నా భద్రతా సిబ్బందికి జాగ్రత్తలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చూసుకోవాలని చెబుతాను. నా టీమ్ మిమ్మల్ని కలుస్తుంది. మీ కారుకు అయిన డ్యామేజ్ రిపేర్ చేయించేందుకు అయ్యే ఖర్చును భరిస్తాను’ అని నారా లోకేష్ హామీ ఇచ్చారు. లోకష్ క్షమాణపలు చెప్పడంపై కళ్యాణ్ భరద్వాజ్ స్పందించారు.. 'మీ దాతృత్వానికి చాలా ధన్యవాదాలు' అంటూ ట్వీట్ చేశారు. నారా లోకేష్పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. సామాన్యుడికి కలిగిన నష్టం గురించి తెలిసి స్పందించిన తీరు బావుందంటున్నారు.
మరోవైపు మంత్రి లోకేష్ విశాఖపట్నంలో నిర్వహించిన సీఐఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సదస్సులో పాల్గొన్నారు. ప్రధానంగా స్టీల్ ప్లాంట్ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. స్టీల్ ప్లాంట్ విషయంలో కొందరు కావాలనే రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగనీయబోమని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే చెప్పారని గుర్తు చేశారు. తాను కూడా పాదయాత్ర సమయంలో అదే చెప్పానని.. గత ఐదేళ్లలో విశాఖ ఉక్కుకు ఏ కొంచెమైనా సాయం జరిగిందా? అని ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆలోచన లేదని.. వైఎస్సార్సీపీ మాత్రం ప్రతి రోజూ ఎక్స్లో దుష్ప్రచారం చేస్తోందని.. ఇంకా వాళ్లకు బుద్ధిరాలేదని లోకేష్ మండిపడ్డారు.
ఏపీలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలున్నాయని చెప్పారు లోకేష్. రాష్ట్రంలో పరిశ్రమలకు కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని.. ప్రభుత్వం ప్రోత్సాహకాల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పరిశ్రమలకు అనుకూల వాతావరణం ఉందని.. ముఖ్యంగా విశాఖ రీజియన్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది అన్నారు. రాబోయే రోజుల్లో అన్ని జిల్లాలకు ఎయిర్పోర్టులకు కనెక్టివిటీకి ఏర్పాట్లు చేస్తున్నామని.. విశాఖపట్నం ఐటీ, ఎలక్ట్రానిక్స్ హబ్గా రూపుదిద్దుకుంటోందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa