కూతురి పెళ్లి చూపుల కార్యక్రమంలో తోడుగా ఉంటాడని మేనల్లుడ్ని పిలిచారు.. అంతా సవ్యంగానే సాగింది. ఇంతలో ఆ ఇంట్లో ఊహించని ఘటన జరిగింది.. ఏం జరిగిందని ఆరా తీస్తే.. మేనల్లుడి ఘనకార్యం బయటపడింది. పార్వతీపురం మండలం పెదబొండపల్లికి చెందిన కండి మణెమ్మ రేషన్ డీలరుగా ఉన్నారు. ఆమె కుమార్తెకు పెళ్లి చేయాలని సంబంధాలు చూశారు.. ఈ క్రమంలో జులైలో కూతురికి పెళ్లి చూపులు ఫిక్స్ అయ్యాయి. అయితే ఈ కార్యక్రమంలో తోడు కోసం రాజమహేంద్రవరంలో ఉంటున్న మేనల్లుడు లక్ష్మణరావును మణెమ్మ పిలిచారు.
పెళ్లిచూపుల కార్యక్రమం ముగిసిన తర్వాత.. మణెమ్మ ఇంట్లో ఎవరూ లేని సమయంలో బంగారు ఆభరణాలు, డబ్బులు తీసుకుని లక్ష్మణరావు వెళ్లిపోయాడు. ఆ మరుసటి రోజు తర్వాత రోజు డబ్బులు, బంగారం కనిపించకపోవడంతో మణెమ్మకు అనుమానం వచ్చింది.. మేనల్లుడి ఘనకార్యంగా గుర్తించారు. అతడు ఈ ఘటన జరిగిన తర్వాత కనిపించకపోవడంతో అనుమానం నిజమైంది. లక్ష్మణరావు ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి బంగారం, డబ్బుల్ని ఎత్తుకెళ్లినట్లు ఆమెకు విషయం అర్థమైంది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. లక్ష్మణరావు గురించి ఆరా తీయగా.. మనోడి చరిత్ర మొత్తం బయటపడింది. గతంలో చేసిన ఘనకార్యాలు కూడా తెలిశాయి.
లక్ష్మణరావుపై రాజమహేంద్రవరంలోనూ మూడు కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అతడు మంగళవారం పెదబొండపల్లి వస్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు ముందుగానే నిఘా పెట్టారు.. నర్సిపురం దగ్గర కాపుకాసి లక్ష్మణరావును అదుపులోకి తీసుకున్నారు. అతడ్ని చోరీ గురించి ప్రశ్నించగా.. తప్పు చేసినట్లు అంగీకరించాడు. తాను అత్త ఇంట్లో తీసిన రూ.50వేలు ఖర్చు చేశానని..16.72 తులాల బంగారు తిరిగి అప్పగించాడు. ఆయనను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశామని ఏఎస్పీ తెలిపారు. ఈ కేసును చేధించిన పోలీసుల్ని ఏఎస్పీ అభినందించారు. మణెమ్మ పెళ్లి చూపుల కార్యక్రమంలో తోడుగా ఉంటాడని మేనల్లుడ్ని పిలిస్తే.. ఏకంగా అత్త ఇంట్లోనే చేతివాటం ప్రదర్శించాడు. చివరికి రెండు నెలల తర్వాత పోలీసులకు చిక్కి జైలుపాలయ్యాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa