తిరుమలలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. శనివారం రాత్రి శ్రీవారి మెట్టు మార్గంలోని కంట్రోల్ రూమ్ వద్దకు చిరుత రావడంతో కుక్కలు వెంటపడ్డాయి. అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది భయంతో కంట్రోల్ రూమ్ లోపలికి వెళ్లి గడియ వేసుకున్నారు. అనంతరం అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆదివారం ఉదయం అక్కడకు చేరుకున్న అటవీ సిబ్బంది.. సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. అది వచ్చి వెళ్లినట్టు స్పష్టంగా అందులో రికార్డు కావడంతో ఆ ప్రాంతంలో చిరుత కోసం గాలిస్తున్నారు. అయితే, రాత్రిపూట కావడం వల్ల ఎటువంటి ప్రమాదం జరగలేదని అధికారులు పేర్కొన్నారు.
తిరుమలకు కాలినడక వెళ్లే భక్తులు అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గం గుండా చేరుకుంటారు. అయితే, శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు మాత్రమే భక్తులను అనుమతిస్తారు. ఆ తర్వాత మూసివేస్తారు. ఆ ప్రాంతంలో రాత్రిపూట జంతు సంచారం ఉండటం వల్ల భక్తులకు ఎటువంటి ప్రమాదం జరగకూడదనే ఉద్దేశంతోనే మెట్టు మార్గం నుంచి అనుమతించరు. కానీ వార్షిక గరుడ సేవ రోజు, వైకుంఠ ఏకాదశి వంటి ప్రత్యేక రోజులలో ఈ మార్గం 24 గంటలపాటు తెరిచి ఉంటుంది. మొత్తం 2.1 కి.మీ పొడవైన మార్గం ద్వారా కొండకు దాదాపు 2.30 గంటల సమయం పడుతుంది.
ఇటీవల కాలంలో తిరుమలలో చిరుత పులులు భక్తులను హడలెత్తిస్తున్నాయి. చిరుత దాడిలో గతేడాది ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. భక్తులపై దాడులతో అలిపిరి మార్గంలో కూడా కొన్నాళ్లు రాత్రివేళ భక్తులను అనుమతించలేదు.
మరోవైపు, పెరటాసి మాసం సందర్భంగా అలిపిరి శ్రీవారి పాదాల మండపం శనివారం భక్తులతో కిక్కిరిసింది. పెరటాసి మాసం రెండో శనివారం కావడంతో తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. భక్తిశ్రద్ధలతో బియ్యపుపిండితో ముగ్గులు వేసి పూజలు చేసి మొక్కలు తీర్చుకున్నారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం కాలినడకన వెళ్లే భక్తులు పాదాల మండపం వద్ద క్యూలో బారులు తీరి కన్పించారు. మెట్ల మార్గంలో తమిళులకు ముఖ్యమైన పెరటాసి మాసం సందర్భంగా రద్దీ నెలకొంది. భక్తులు శ్రీవారి పాదుకలు తలపై ఉంచుకుని ప్రదక్షిణలు చేస్తూ కన్పించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa