ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐటీ రిటర్నుల్లో ఆ విషయాలు దాచారా? రూ.10 లక్షల ఫైన్ పడుద్ది.. చూసుకోండి

business |  Suryaa Desk  | Published : Sun, Sep 29, 2024, 11:06 PM

ఆదాయపు పన్ను రిటర్ను దాఖలు చేసేందుకు గడువు జులై 31తోనే ముగిసింది. అయితే పెనాల్టీతో కలిపి డిసెంబర్ 31 వరకు రిటర్నులు ఫైల్ చేయవచ్చు. బిలేటెడ్ ఐటీఆర్ అని అంటారు. ఐటీఆర్‌లో ఏమైనా తప్పులు దొర్లినప్పుడు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. అయితే, పన్ను చెల్లింపుదారులు కొన్ని విషయాలను కచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆదాయం అనేది వివిధ మార్గాల ద్వారా వస్తుంది. కొందరు దేశంలోని వివిధ మార్గాల ద్వారా సంపాదిస్తే.. మరికొందరు విదేశాలకు వెళ్లి ఆర్జిస్తుంటారు. ఇలా దేశంలో కొంత కాలం ఉండి విదేశాల్లో వ్యాపారం, ఉద్యోగం చేసే వారు అక్కడి ఆదాయానికి సంబంధించి ట్యాక్స్ చెల్లించాలా వద్దా అనే ప్రశ్న వస్తుంది. ఒక వ్యక్తి ఒక ఆర్థిక ఏడాదిలో భారత్‌లో 182 రోజులు ఉన్నట్లయితే సదరు వ్యక్తిని రెసిడెంట్‌ ఇండియన్‌గానే పరిగణిస్తారు. ఈ కారణంగా భారతీయ నివాసి విదేశీ ఆదాయం కూడా ఇన్‌కమ్ ట్యాక్స్ పరిధిలోకి వస్తుందని గుర్తుంచుకోవాలి. ఇక్కడి పన్ను రేట్లే వారికి సైతం వర్తిస్తాయి.


ఆదాయపు పన్ను రిటర్నులో విదేశాల్లోని షేర్లు, ఇతర ఆస్తుల వివరాలను తప్పకుండా చూపించాలి. ఎవరైనా తమ రిటర్నుల్లో విదేశాల్లోని ఆస్తులు, పెట్టుబడుల వివరాలను దాచిపెడితే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. బ్లాక్ మనీ యాక్ట్ 2015 నిబంధనల ఉల్లంఘన కింద భారీగా పెనాల్టీతో పాటు జైలు జీవితం సైతం గడపాల్సి వస్తుంది. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. ఐటీఆర్‌ షెడ్యూల్ ఎఫ్‌ఏలో విదేశాల్లోని ఆస్తులు, షేర్లు, పెట్టుబడుల వివరాలు పేర్కొనకపోవడంతో ఒక వ్యక్తికి గతంలో ముంబై ఇన్‌కమ్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రైబ్యునల్ రూ.10 లక్షల మేర జరిమానా విధించింది. అందుకే విదేశాల్లో ఆస్తులు, పెట్టుబడులు ఉంటే ఐటీఆర్ షెడ్యూల్ ఎఫ్ఏలో కచ్చితంగా పేర్కొనాలి. విదేశాల్లో ఉద్యోగం చేస్తుంటే ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ ద్వారా వచ్చే షేర్లు, ఆదాయం వివరాలు సైతం వెల్లడించాల్సిందే.


 విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న వారు తమ జీతాన్ని ఇన్‌కమ్ ఫ్రమ్ శాలరీ హెడ్‌లో సూచించాలి. ఫారెన్ కరెన్సీలో అందుకున్న శాలరీని మన దేశ కరెన్సీలోకి మార్చి ఎంత అనేది వెల్లడించాలి. అక్కడ పని చేస్తున్న కంపెనీ వివరాలు సైతం ఇవ్వాలి. విదేశాల్లో సంపాదిన ఆదాయాన్ని ఇన్‌కమ్ ట్యాక్స్ డాక్యుమెంట్లలో ఫారిన్ అసెట్స్ విభాగంలో పేర్కొనాలి. విదేశాల్లో ఆస్తులు, బ్యాంక్ ఖాతాల వివరాలు సైతం సమర్పించాల్సి ఉంటుంది.


పైన పేర్కొన్న ఈ సమాచారం దాచిపెట్టినట్లు గుర్తిస్తే ఇన్‌కమ్ ట్యాక్స్ విభాగం నుంచి నోటీసులు అందుతాయి. విదేశాల్లో బ్యాంకు అకౌంట్, ఆస్తులు, ఆదాయం ఉన్నట్లయితే 2024-25 అసెస్‌మెంట్ ఇయర్‌కు సంబంధించిన ఐటీ రిటర్నులు ఫైల్ చేసేప్పుడే ఫారిన్ అసెట్స్ షెడ్యూల్‌లో సూచించాలని ఐటీ శాఖ గతంలోనే పలు వేదికలుగా అవగాహన కల్పించింది. ఒక వేళ మీరు ఫారెన్ ఆదాయం వెల్లడించకపోతే ఐటీ శాఖ పెనాల్టీ విధిచండంతో పాటు చట్ట పరమైన చర్యలు మీపై తీసుకుంటుంది. బ్లాక్ మనీ (వెల్లడించని ఆదాయం, ఆస్తులు) యాక్ట్ 2015 ద్వారా ట్యాక్స్ పేయర్‌కు రూ. 10 లక్షల వరకు పెనాల్టీ విధించేందుకు అవకాశం ఉంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa