ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉన్న 13 జిల్లాలు 26 జిల్లాలుగా పెరిగాయి. ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో మరికొన్ని జిల్లాలను ఏర్పాటు చేయాలనే డిమాండ్ వినిపించింది. ఉమ్మడి కడప, ఉమ్మడి ప్రకాశం, ఉమ్మడి అనంతపురం, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల్లో పలు డిమాండ్లు తెరపైకి వచ్చాయి. ఇటీవల ఎన్నికల సమయంలో కూటమి ఈ డిమాండ్లపై హామీలు ఇచ్చింది. వీటిలో ప్రధానంగా మార్కాపురం కేంద్రంగా, హిందూపురం కేంద్రంగా జిల్లాలు ఏర్పాటు చేయాలనే డిమాండ్లు వచ్చాయి. అలాగే రాజంపేటకు సంబంధించి కూడా కొన్ని అభ్యంతరాలు వచ్చాయి.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంతో కొత్త జిల్లాల డిమాండ్లు తెరపైకి వచ్చాయి. ఆయా ప్రాంతాల ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు ఈ అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించారు. అయితే తాజాగా రాష్ట్రంలో 26 జిల్లాలు కాస్త 30 జిల్లాలుగా ఏర్పాటు కాబోతున్నాయని.. కొన్ని మార్పులు, చేర్పులు జరగబోతున్నట్లు సోషల్ మీడియాలో ఓ డాక్యుమెంట్ వైరల్ అవుతోంది. కొత్తగా మరికొన్ని జిల్లాలను ఏర్పాటు చేయడంతో పాటుగా ప్రస్తుతం ఉన్న జిల్లాల్లో కూడా మార్పులు చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒకటి, రెండు జిల్లాలను రద్దు చేయబోతున్నట్లు జోరుగా ఊహాగానాలు మొదలయ్యాయి.
కొత్త జిల్లాల ఏర్పాటు, ప్రస్తుతం ఉన్న జిల్లాలను రద్దు చేస్తారనే ప్రచారంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పందించింది. 'ఒక సామాన్యుడు ఇచ్చిన సలహాని, ప్రభుత్వ నిర్ణయంగా ప్రకటిస్తూ, సమాజంలో అశాంతి రేపడానికి కొంత మంది అల్లరి మూకలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అనకాపల్లి జిల్లా రద్దు చేస్తున్నారు అనేది పూర్తిగా అవాస్తవం'అంటూ ట్వీట్ చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న డాక్యుమెంట్ను ఎవరూ నమ్మొద్దని కోరారు. ఈ జిల్లాల అంశంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెబుతున్నారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న డాక్యుమెంట్లో.. రాష్ట్రంలో జిల్లాల సంఖ్యను పెంచి ఐదు క్లస్టర్లు ఏర్పాటు చేయాలని సూచించినట్లుగా ఉంది. ఉత్తర కోస్తాంధ్ర, మధ్య కోస్తాంధ్ర, దక్షిణ రాయలసీమ, పశ్చిమ రాయలసీమ, ఉత్తర రాయలసీమలను ఏర్పాటు చేయాలన్నారు. ఈ క్లస్టర్లలో ఏ, ఏ జిల్లాలను చేర్చాలి, కొత్తగా ఏ జిల్లాలను ఏర్పాటు చేస్తే బావుంటుంది.. ఏ జిల్లాలను రద్దు చేయాలనే అంశాలను పొందుపరిచారు. ఈ డాక్యుమెంట్ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ.. ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రచారం చేయడంపై ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పందించి ఈ అంశంపై క్లారిటీ ఇచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa