ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ అధినేత జగన్ ఆస్తి వ్యవహారంపై స్పందించారు. నీ మీద, అవినాశ్ మీద ఏమీ మాట్లాడకూడదా.... చెల్లికి ఆస్తి ఇవ్వడానికి ఇలాంటి కండిషన్ పెడతావా? అని మండిపడ్డారు. చిల్లర రాజకీయాలు చేసే ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉంటాడని ఊహించలేదని అన్నారు. ఛీ ఛీ... ఇలాంటి వాడితో రాజకీయ పోరాటం చేస్తున్నందుకు సిగ్గుగా ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. తల్లి మీద కోర్టుకు వెళ్లింది నువ్వు... చెల్లిని రోడ్డు మీదికి లాగింది నువ్వు... ఇవన్నీ నువ్వు చేసి, డైవర్షన్ పాలిటిక్స్ అని మా మీద పడి ఏడుస్తున్నావు అంటూ విమర్శించారు. మీ కుటుంబ విషయాలతో మాకేంటి సంబంధం? అని ప్రశ్నించారు. భర్త సంపాదించిన ఆస్తిలో మొదటి హక్కు భార్యకు రాదా? మీ తల్లిని నువ్వు కోర్టుకు లాగి, అందుకు మేమే కారణమంటే ఎలా? అని చంద్రబాబు నిలదీశారు. విలువలు లేని రాజకీయం చేస్తూ, అందులో హీరోయిజం చూపించాలని జగన్ అనుకుంటున్నాడు... ఇలాంటి వాళ్లను ఆదర్శంగా తీసుకోవద్దని మీ పిల్లలకు చెప్పండి అని వ్యాఖ్యానించారు. ప్రపంచం ముందుకు పరిగెడుతోందని, ఇంకా ఈ విలువలు లేని మనుషుల గురించి మనం ఆలోచిస్తూ ఉండడం ఎందుకని చంద్రబాబు పేర్కొన్నారు. చిల్లర రాజకీయాలు తిండిపెట్టవని, చెత్త రాజకీయాలు ప్రజలను కాపాడవని అన్నారు. విలువలు లేని వ్యక్తులు సమాజానికి చేటు అని, ఇలాంటి చెత్త రాజకీయాలు చేసే వారిని ప్రజలు మర్చిపోవాలని పిలుపునిచ్చారు. గత ఐదేళ్లలో తనను స్వేచ్ఛగా బయట తిరగనివ్వలేదని చంద్రబాబు ఆరోపించారు. "ఇప్పుడు నువ్వు స్వేచ్ఛగా తిరుగుతున్నావు కదా... నిన్నేమైనా నిలువరించామా మేము? నాకు చేతకాదనుకున్నావా? నాకు రాజకీయాలు తెలియవా? నిన్ను నిలువరించడం నాకు ఒక్క నిమిషం పని" అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa