మాజీ మంత్రి, జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డికి ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంగోలు నియోజకవర్గంలో అవకతవకలు జరిగాయంటూ బాలినేని శ్రీనివాసరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఒంగోలు నుంచి పోటీ చేసి ఓడిపోయిన బాలినేని.. తన ఓటమికి ఈవీఎంలే కారణమని అప్పట్లో ఆరోపించారు. ఒంగోలులోని 12 పోలింగ్ కేంద్రాలలో ఏర్పాటు చేసిన ఈవీఎంలలో అక్రమాలు జరిగాయని.. వీటిలో రీపోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘాన్ని గతంలో కోరారు. అయితే తన ఫిర్యాదుపై ఎన్నికల సంఘం పరిశీలనను తప్పుబడుతూ అనంతరం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వీవీ ప్యాట్ స్లిప్పులను లెక్కించాలని ఆదేశించాలంటూ పిటిషన్లో బాలినేని శ్రీనివాసరెడ్డి హైకోర్టును అభ్యర్థించారు. అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి పిల్ను విచారించిన హైకోర్టు.. పిటిషన్ కొట్టివేస్తూ సోమవారం నిర్ణయం తీసుకుంది.
మరోవైపు ఒంగోలు నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన బాలినేని శ్రీనివాసరెడ్డి.. ఇటీవల వైసీపీని వీడి జనసేన పార్టీలో చేరారు. వైసీపీ పార్టీ విధానాలు, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీరును తప్పుబడుతూ పార్టీకి రాజీనామా చేశారు బాలినేని. అలాగే ఎన్నికల్లో అవకతవకలపై తన పోరాటానికి వైసీపీ మద్దతుగా నిలవడం లేదంటూ అప్పట్లో ఆరోపించారు. రాజీనామా తర్వాత మరో వైసీపీ నేత సామినేని ఉదయభానుతో కలిసి జనసేన పార్టీలో చేరారు. డిప్యూటీ సీఎం, జనసేనాని పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన కండువా కప్పుకున్నారు. జనసేనలో చేరిన తర్వాత వైసీపీపైనా, వైఎస్ జగన్ పైనా విమర్శలు గుప్పిస్తున్నారు,
మరోవైపు కాంగ్రెస్ పార్టీలో విద్యార్థి నేతగా బాలినేని శ్రీనివాసరెడ్డి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థిగా ఒంగోలు అసెంబ్లీ నుంచి 1999, 2004, 2009 ఎన్నికల్లో వరుసగా విజయం సాధించారు. అలాగే మంత్రిగానూ పనిచేశారు. అయితే వైఎస్ఆర్ మరణం తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో ఒంగోలు నుంచి వైసీపీ తరుఫున విజయం సాధించారు. అయితే 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన బాలినేని శ్రీనివాసరెడ్డి ... వైసీపీ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ వచ్చారు. 2019లో వైసీపీ తరుఫున ఒంగోలు నుంచి మరోసారి గెలుపొందిన బాలినేని శ్రీనివాసరెడ్డి.. వైఎస్ జగన్ మంత్రివర్గంలో పనిచేశారు. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత వైసీపీని వీడి జనసేనలో చేరిపోయారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa