కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అమాయక ప్రజలు తనువు చాలిస్తున్నారని వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కొమ్మూరి కనకారావు ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా బాపట్ల జిల్లా బల్లికురవ మండలం చిన్నజమ్మలమడకకు చెందిన చింతల శ్రీను ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని పేర్కొన్నారు. ఇంకా ఎంత మంది అమాయకులను బలి తీసుకుంటారని సీఎం చంద్రబాబును కనకారావు ప్రశ్నించారు. ఈ మేరకు చింతల శ్రీను ఆత్మహత్యకు ముందు తీసుకున్న సెల్ఫీ వీడియోను కనకారావు మీడియా సమావేశంలో చూపించారు.
తన తాతల, తండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిన భూమిని స్ధానిక టీడీపీ నేతలు అక్రమంగా ఆన్లైన్ చేయడం వల్ల చింతల శ్రీను ఈ నెల 21న పురుగుల మందు తాగి నిన్న (28.10.2024) ఒంగోలు రిమ్స్లో మరణించాడు. చింతల శ్రీను తన సమస్యను సెల్ఫీ వీడియో కూడా తీసుకున్నాడు. టీడీపీ నేతలు వేధింపులకు గురిచేయడమే కాకుండా పోలీసుల ద్వారా ఇబ్బందులకు గురిచేయడంతో తట్టుకోలేని శ్రీను ఆత్మహత్యాయత్నం చేసి మరణించాడు. చింతల శ్రీను సెల్ఫీ వీడియోలో మంత్రి గొట్టిపాటి రవికుమార్తో పాటు స్ధానిక టీడీపీ నేతల పేర్లు, ప్రభుత్వ అధికారుల వ్యవహారశైలిని వివరించాడు. టీడీపీ నేతల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న శ్రీను కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం, అంతేకాక శ్రీను తన వీడియోలో ప్రస్తావించిన వారందరినీ వెంటనే అరెస్ట్ చేయాలి, వేధింపులకు గురిచేసిన బల్లికురవ ఎస్ఐ చౌదరిని సస్పెండ్ చేయాలి, శ్రీను వారసత్వ భూమిపై తిరిగి అతని వారసులకు ఆన్లైన్ చేసి భూహక్కులు కల్పించాలని కొమ్మూరి కనకారావు డిమాండ్ చేశారు. శ్రీను ఆత్మహత్యాయత్నం చేసిన తర్వాత సకాలంలో వైద్యం అందించని అద్దంకి గొట్టిపాటి సత్యనారాయణ హాస్పిటల్పై కూడా చర్యలు తీసుకోవాలని కనకారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa