ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను టీడీపీ కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. ఇప్పటికే పలు హామీలను అమలు చేసిన ఏపీ ప్రభుత్వం.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయాల్లో పనిచేసే అర్చకుల కనీస వేతనాలను పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఏపీ దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మంగళవారం వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.50 వేల ఆదాయం దాటిన దేవాలయాల్లోని అర్చకులకు వేతనం పెంచుతున్నట్లు ఆనం రామనారాయణరెడ్డి చెప్పారు. ఈ ఆలయాల్లో పనిచేసే పూజారులకు 15 వేల రూపాయలు కనీస వేతనం ఇవ్వనున్నట్లు చెప్పారు.
సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారన్న రామనారాయణరెడ్డి.. ప్రభుత్వ నిర్ణయంతో 3,203 మంది అర్చకులకు లబ్ధి చేకూరుతుందన్నారు. ఈ నిర్ణయం అమలు కారణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఖజానా మీద రూ.10కోట్లు అదనపు భారం పడనుంది. ఈ నేపథ్యంలో కొంత మొత్తం సీజీఎఫ్ నిధుల నుంచి ఇవ్వనున్నట్లు దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చెప్పారు.
మరోవైపు రాష్ట్రంలోని వేద పండితులకు నిరుద్యోగ భృతి చెల్లించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. సంభావన రూపంలో నెలకు రూ.3వేల చొప్పున చెల్లించాలని ఇటీవల నిర్ణయించారు. రాష్ట్రంలోని 7 దేవాలయాల పరిధిలో ఉన్న 600 మంది వేద పండితులకు ఈ నిర్ణయం ద్వారా లబ్ది చేకూరనుంది. సింహాచలం, ద్వారక తిరుమల, కనకదుర్గ, శ్రీకాళహస్తి, అన్నవరం, కాణిపాకం, శ్రీశైలం ఆలయాల్లోని వేద పండితులకు నిరుద్యోగ భృతి కింద మూడు వేలు చెల్లించనున్నారు.
అలాగే ప్రైవేట్ దేవాలయాలలో ధూప దీప నైవేద్యాలకు అందించే మొత్తాన్ని కూడా ఏపీ ప్రభుత్వం పెంచిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో సుమారుగా ఆరు వేల వరకూ ప్రైవేట్ దేవాలయాలు ఉన్నాయి. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో వీటికు నెలకు ఆరు వేల రూపాయలను ధూప దీప నైవేద్యాల కోసం అందించేవారు. అయితే తాము అధికారంలోకి వస్తే ఈ మొత్తాన్ని పది వేలకు పెంచుతామని ఎన్నికల సందర్భంగా చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇచ్చిన ప్రకారమే అధికారంలోకి రాగానే ఈ మొత్తాన్ని పదివేలకు పెంచారు. తాజాగా ఆలయాల్లోని అర్చకులకు కనీస వేతనం పెంచాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa