సీఎం చంద్రబాబు నాయుడు.. ఇటీవల శ్రీకాకుళం, అనకాపల్లి, విశాఖ జిల్లాల్లో పర్యటించారు. ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం అయిందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ సందర్భంగా పలు కీలక విషయాలను ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు చేసి ఇతర రాష్ట్రాలకు వెళ్లే వలసలు అడ్డుకట్ట వేస్తామని చెప్పారు. ఈ సందర్భంగానే శ్రీకాకుళం జిల్లాలో ఎయిర్పోర్టు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. అదే సమయంలో 2025 నాటికి వంశధార ఫేజ్-2 పూర్తి చేస్తామని వెల్లడించారు. ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు పూర్తి చేస్తామని సీఎం హామీ ఇచ్చినట్లు చెప్పారు. గత 5 ఏళ్లు నీటిపారుదల ప్రాజెక్టులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని పేర్కొన్నారు. అరసవల్లి ఆలయంలో ఆధునిక సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని వివరించారు.
గతంలో శ్రీకాకుళం జిల్లా అభివృద్ధిపై ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం ఏర్పాటు చేయలేదని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలోని చాలా సమస్యల పరిష్కారానికి నిర్ణయాలు తీసుకుంటున్నట్లు చెప్పారు. నీటి పారుదల ప్రాజెక్టులు, కంపెనీల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. 2019లో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయినపుడు ప్రాజెక్టులు ఏ దశలో ఉన్నాయో ఇప్పుడు అదే స్థితిలో ఉన్నాయన్నారు. వంశధార ఫేజ్ 2 పూర్తి చేస్తామని.. నాగావళి – వంశధార అనుసంధానం చేస్తామని చెప్పారు.
ఇక ఆఫ్ షోర్ రిజర్వాయర్ పూర్తి చేస్తామని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. మూలపేట పోర్టు సమీపంలో 10 వేల ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉందని చెప్పారు. ఆ ప్రాంతంలో ఇండస్ర్టియల్ అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. బీచ్ ఇసుక ద్వారా టైటానియం ఇండస్ర్టీ అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ప్రజాధనం దుర్వినియోగం కాకూడదనే మూలపేట పోర్టును కొనసాగిస్తున్నామని చెప్పారు. మూలపేట సమీపంలో ఎయిర్పోర్టు సిద్ధం చేస్తామని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. మూలపేట పోర్టుకు అనుసంధానంగా పారిశ్రామికాభివృద్ధి సైతం చేపట్టాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని వివరించారు.
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని ప్రముఖ పుణ్య క్షేత్రమైన అరసవెల్లి అభివృద్ధికి కూడా చర్యలు చేపడతామని ప్రకటించారు. అంతర్జాతీయ స్థాయిలో అరసవెల్లి దేవాలయం అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఈ ఆలయాభివృద్ధిని కేంద్ర ప్రభుత్వ ప్రసాదం పథకంలో భాగంగా చేపడతామని వివరించారు. ఇక శ్రీకాకుళం జిల్లాలో వెయిట్ లిఫ్టింగ్ అకాడమీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa