ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవన్‌కళ్యాణ్ ఇప్పటికైనా ఆలోచించడం నేర్చుకోవాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Nov 11, 2024, 03:52 PM

పోలీసులను హెచ్చరిస్తే సుమోటో కేసులు పెడతామని ఎవర్ని బెదిరిస్తున్నారని డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ను వైయ‌స్ఆర్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు సూటిగా ప్రశ్నించారు. చట్టవ్యతిరేకంగా వ్యవహరించిన ఎవర్నీ వదిలిపెట్టబోమన్న ఆయన, వారికి ఇష్టం వచ్చినట్లు కేసులు పెట్టాలని సవాల్‌ చేశారు. గుంటూరు క్యాంప్‌ ఆఫీస్‌లో వైయ‌స్ఆర్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆనాడు పోలీసులపై టీడీపీ నేతలు చేసిన దారుణ విమర్శలను ఆయన ప్రస్తావించారు. పోలీసుల సంగతి తేలుస్తామని చంద్రబాబు ప్రకటించారని.. ఇంకా వారు సంఘ విద్రోహ శక్తులని, అధికారంలోకి రాగానే బొక్కలో వేస్తానని, పోలీసుల సంగతి తేలుస్తానని హెచ్చారించారని గుర్తు చేశారు. ఇక దొబ్బి తినడానికే అంత మంది పోలీసులు వచ్చారా అని అచ్చెన్నాయుడు దుయ్యబట్టారని ప్రస్తావించారు.


మరి అలాంటప్పుడు చంద్రబాబుపై సుమోటో కేసులేవని ప్రశ్నించిన మాజీ మంత్రి, అసలు చెప్పు చూపిస్తూ మాట్లాడిన పవన్, తన వైఖరి, వాడిన భాషకు ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. ఇప్పటికైనా పవన్‌కళ్యాణ్, సీఎం చంద్రబాబు మౌత్‌పీస్‌లా మాట్లాడడం మాని, ఆలోచించడం నేర్చుకోవాలని హితవు పలికారు. చట్టాన్ని అతిక్రమించి, వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలు, నాయకులను వేధిస్తున్న అధికారులు.. సప్తసముద్రాల అవతల ఉన్నా, రిటైర్‌ అయినా తీసుకొచ్చి న్యాయస్థానాల్లో శిక్షిస్తామని తమ అధినేత వైయస్‌ జగన్‌ మాటలకు తమ పార్టీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. చరిత్రలో ఎక్కడా లేని విధంగా 14 మంది ఐపీఎస్‌ అధికారులకు పోస్టింగ్‌ ఇవ్వకుండా వేధించిన ప్రభుత్వం ఎక్కడైనా ఉందా? అని ప్రశ్నించిన మాజీ మంత్రి.. ఒక హ్యాబిచ్యువల్‌ క్రిమినల్‌ అయిన సినీ నటి చెప్పిన మాటలు నమ్మి ఐజీ స్థాయి అధికారి సహా ముగ్గురు ఐపీఎస్‌లను సస్పెండ్‌ చేయడం కూడా  ఎక్కడా జరగలేదని గుర్తు చేశారు. తనపై దారుణంగా ట్రోల్‌ చేశారంటూ, తమ పార్టీకి చెందిన మాజీ మంత్రి విడదల రజని ఫిర్యాదు చేస్తే, ఇప్పటి వరకు పోలీసులు ఎలాంటి చర్య తీసుకోలేదని అంబటి రాంబాబు తెలిపారు. ఇకనైనా పోలీసులు తమ వైఖరి మార్చుకోవాలన్న ఆయన, తమ పార్టీ సోషల్‌ మీడియా కార్యకర్తలను అక్రమంగా నిర్భంధించి శారీరకంగా హింసిస్తే ఊర్కునేది లేదని హెచ్చరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa