వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆసక్తికర ట్వీట్ చేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబుకు వీర విధేయుల్లో కొందరు 30 ఏళ్ల నాటి ఎన్టీఆర్-లక్ష్మీపార్వతికి అత్యంత సన్నిహితులనేది వాస్తవం అని పేర్కొన్నారు. ఇది చారిత్రక పరిణామం అని, దాచినా దాగని నిజం అని, మార్చలేని సత్యం అని అభివర్ణించారు. వీళ్లు 1994-96లో ఫిరాయింపుదారులు... ఆ విషయం ప్రజలకు, మీడియాకు గుర్తుండదనుకోవడం వారి అజ్ఞానం అని విజయసాయి విమర్శించారు. "వారంతా తాము పుట్టుకతోనే చంద్రబాబుకు విధేయులమని చెప్పుకోవడం సిగ్గుచేటు. అంతేకాదు, ప్రజలను వంచించడం కూడా. వీళ్లలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి, దాడి వీరభద్రరావు, మాకినేని పెదరత్తయ్య, ప్రతిభా భారతి, కళా వెంకటరావు, చింతకాయల అయ్యన్నపాత్రుడు, గాలి ముద్దుకృష్ణమనాయుడు, చిక్కాల రామచంద్రరావు, పరిటాల రవి, గాదె లింగప్ప, ముక్కు కాశిరెడ్డి, గౌతు శివాజీ, గద్దె బాబూరావు ఉన్నారు. ఇక ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి బహిష్కరణకు గురైన వారిలో చంద్రబాబు, యనమల, అశోక్ గజపతిరాజు ఉన్నారు. వీళ్లలో 90 శాతం మంది... ఎన్టీఆర్ మరణించాక 1996 లోక్ సభ ఎన్నికల్లో టీడీపీ (లక్ష్మీపార్వతి వర్గం) ఒక్క సీటు కూడా గెలుచుకోకపోవడంతో గుట్టుచప్పుడు కాకుండా చంద్రబాబు పార్టీలో చేరారు. 1997-2004 మధ్య ఉమ్మడి ఏపీ టీడీపీ మంత్రివర్గం సభ్యులుగా... కొందరు ఎంపీలుగా... మరికొందరు పార్టీ పదవులు పొందరు. ఇది మాయని మచ్చ... చరిత్ర క్షమించదు" అంటూ విజయసాయిరెడ్డి తన ట్వీట్ లో వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa