తిరుమల శ్రీవారికి ఇద్దరు భక్తులు భారీ విరాళాలను అందించారు. బెంగళూరుకు చెందిన బీఎంకే నగేష్ అనే భక్తుడు టీటీడీ ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్కు రూ.50 లక్షలు విరాళంగా ఇచ్చారు. ఈ మేరకు దాత నగేష్ స్వయంగా డీడీని టీటీడీ అడిషనల్ ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరికి తిరుమలలోని క్యాంపు కార్యాలయంలో అందజేశారు. మరోవైపు తిరుమల శ్రీవారికి హైదరాబాద్కు చెందిన మరో భక్తుడు ఎలక్ట్రిక్ బైకుల్ని కానుకగా అందజేశారు.
హైదరాబాద్ పెరల్ మినిరల్స్ అండ్ మైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ సీ వెంకట నాగరాజ 15 టీవీఎస్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను విరాళంగా అందజేశారు. ముందుగా తిరుమల శ్రీవారి ఆలయం దగ్గర ఈ వాహనాలకు పూజలు నిర్వహించగా.. టీటీడీ అడిషనల్ ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి పాల్గొన్నారు. అనంతరం దాత నాగరాజ వారికి వాహనాల తాళాలను అందజేశారు. ఈ 15 బైకుల ధర దాదాపు రూ.22 లక్షలు ఉంటుందని దాత తెలియజేశారు. ఇవాళ రాత్రి తిరుమల శ్రీవారి ఆలయంలో కార్తీక మాస పౌర్ణమి గరుడసేవ జరగనుంది.
రాత్రి 7 నుంచి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్పస్వామివారు సువర్ణకాంతులీనుతున్న గరుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు.
తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం పరేడ్ మైదానంలో నవంబరు 18వ తేదీ రాత్రి నిర్వహించనున్న కార్తీక మహాదీపోత్సవానికి టిటిడి విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టనున్నట్లు టీటీడీ జేఈవో వీరబ్రహ్మం తెలిపారు. టీటీడీ పరిపాలనా భవనంలోని జేఈవో ఛాంబర్ లో సంబంధిత ఉన్నతాధికారులతో ఆయన సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. హెచ్ డీపీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్తీక మహా దీపోత్సవానికి భక్తులు విశేషంగా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు జేఈవో వీర బ్రహ్మం. ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తామన్నారు. ఈ కార్యక్రమానికి రాలేని భక్తులు ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించాలని సూచించారు.
ఇందులో భాగంగా మహిళలు కూర్చుని దీపాలు వెలిగించేలా దీపపు దిమ్మెలు, నేతి వత్తులు ఏర్పాటు చేస్తున్నారు. మైదానం మొత్తం తివాచీలు, ఒక్కో దీపపు దిమ్మె వద్ద తులసి మొక్కను ఉంచనున్నారు. కార్యక్రమం అనంతరం మహిళలకు ఈ మొక్కలను అందిస్తారు.
వేదికను శోభాయమానంగా పుష్పాలతో, విద్యుత్ దీపాలు, వేదిక ఇరువైపులా ఆధ్యాత్మికత ఉట్టిపడేలా సెట్టింగ్ లు ఏర్పాటు చేస్తున్నారు.
కార్యక్రమంలో భాగంగా నిర్వహించనున్న శ్రీ మహాలక్ష్మీపూజకు ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. టిటిడి పరిపాలనా భవనం ప్రధాన ద్వారాల నుంచి ఆవరణం మొత్తం అరటి చెట్లు, పూలు, విద్యుద్దీపాలతో అలంకరించనున్నారు. ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో మైదానంలో బ్యారికేడ్లు ఏర్పాటు చేస్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa