బాలీవుడ్ నటి దిశా పటానీ తండ్రిని.. ఓ ముఠా రూ.25 లక్షలు మోసం చేసింది. ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైర్డ్ అయిన దిశా పటానీ తండ్రి జగదీష్ సింగ్ పటానీకి పరిచయం అయిన ఓ వ్యక్తి ద్వారా ఈ గ్యాంగ్ పరిచయం అయింది. అయితే వారు ఆయనకు ఒక ఉన్నత పదవి ఇప్పిస్తామని ఆశ చూపారు. గుడ్డిగా వారు చెప్పిన విషయాలు నమ్మిన జగదీష్ సింగ్ పటానీ.. అడ్డంగా మోసపోయారు. యూపీలో రిటైర్డ్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అయిన జగదీష్ సింగ్ పటానీకి.. ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే కమిషన్లో ఒక కీలక పదవి ఇప్పిస్తామని వారు అతడ్ని నమ్మించారు. మొత్తం రూ.25 లక్షలు తీసుకోగా.. అందులో రూ.5 లక్షల నగదు, రూ.20 లక్షలను వివిధ బ్యాంక్ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేశారు. తాజాగా దిశా పటానీ తండ్రి జగదీష్ సింగ్ పటానీ యూపీ పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం బయటికి వచ్చింది.
ఉత్తరప్రదేశ్లోని బరేలీకి చెందిన జగదీష్ పటానీ తన స్నేహితుడి ద్వారా శివేంద్ర ప్రతాప్ సింగ్ దివాకర్ గార్గ్, ఆచార్య జయప్రకాష్ అనే ఇద్దరు వ్యక్తులు పరిచయం అయ్యారు. వీరిద్దరూ తమకు బలమైన రాజకీయ నేతలతో సంబంధాలు ఉన్నాయని జగదీష్ సింగ పటానీని నమ్మించారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ కమిషన్లో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ లేదా ఇతర కీలక పదవుల్లో ఏదో ఒకదాన్ని ఇప్పించేలా చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో వారి మాటలను నమ్మిన జగదీష్ సింగ్ పటానీ.. వారు అడిగినప్పుడల్లా డబ్బులు ఇచ్చాడు. ఈ క్రమంలోనే అతని నుంచి మొత్తం రూ. 25 లక్షలు.. వారిద్దరూ కాజేశారు.
అయితే వారికి డబ్బులు చెల్లించి 3 నెలలు గడుస్తున్నా ఎలాంటి సమాచారం లేదని గ్రహించాడు. దీంతో తాను మోసపోయానని గుర్తించాడు. ఎన్నిసార్లు అడిగినా వారు తన డబ్బును తిరిగిస్తానని చెబుతున్నారని.. అయితే ఇవ్వడం లేదని పేర్కొన్నాడు. వారికి రూ. 5 లక్షలను నగదు రూపంలో.. రూ. 20 లక్షలను వేర్వేరు బ్యాంకు అకౌంట్లకు బదిలీ చేసినట్లు వెల్లడించాడు. అంతేకాకుండా తనకు డబ్బు ఇవ్వకపోగా.. తిరిగి తనపైనే బెదిరింపులకు దిగారని.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం శివేంద్ర ప్రతాప్ సింగ్ దివాకర్ గార్గ్, ఆచార్య జయప్రకాష్ ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసుకుని వారిని వెతికే పనిలో పడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa