రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. యుద్ధగతిని మార్చేలా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్కు తాము అందజేస్తోన్న దీర్ఘ శ్రేణి క్షిపణులను (ఆర్మీ టాక్టికల్ మిస్సైల్ సిస్టమ్) రష్యా భూభాగంపై దాడికి వినియోగించుకునేందుకు అనుమతిస్తున్నట్లు సమాచారం. దీంతో రష్యాపైకి దీర్ఘ శ్రేణి క్షిపణులను ప్రయోగించే అవకాశం ఉక్రెయిన్కు దక్కుతుంది. ఉత్తర కొరియాకు చెందిన 10 వేల మంది సైనికులను ఉక్రెయిన్ సరిహద్దుల్లోని కుర్స్క్ ప్రాంతంలో మోహరించేందుకు రష్యా ప్లాన్ చేసినట్టు నివేదికలు అందుతోన్న వేళ అమెరికా నిర్ణయం వెలువడటం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే, ఈ ఆయుధాల వినియోగంపై బ్యాన్ ఎత్తేసిన విషయాన్ని ఇంకా వైట్హౌస్ ధ్రువీకరించలేదు.
కానీ, రష్యాపై తొలిసారి దీర్షశ్రేణి క్షిపణుల ప్రయోగానికి ఉక్రెయిన్ సిద్దమవుతోందని రాయిటర్స్ నివేదించింది. వీటితో కుర్స్క్ రీజియన్లో రష్యా, ఉత్తర కొరియా బలగాలపై దాడిచేసే అవకాశం ఉందని తెలిపింది. దీర్ఘశ్రేణి క్షిపణుల వినియోగానికి అమెరికా అనుమతించడంతో రష్యా అధీనంలో ఉన్న ప్రాంతాలపై దాడికి కీవ్ను అనుమతిస్తుంది. సంఘర్షణ పెరిగే ప్రమాదం ఉన్నందున బైడెన్ యంత్రాంగం మొదట్లో వీటి వినియోగంపై నిషేధం విధించినట్టు నివేదికలు సూచిస్తున్నాయి
రష్యా గగనతల దాడుల ముప్పు ముఖ్యంగా క్షిపణి దాడులను అడ్డుకోడానికి ఉక్రెయిన్కు అమెరికా పేట్రియాట్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ అందజేసింది. ఈ వ్యవస్థ సాయంతో క్షిపణులు, యుద్ధ విమానాల దాడులను అడ్డుకుంటోంది. హై మొబలిటీ ఆర్టిలరీ రాకెట్ వ్యవస్థ, అబ్రామ్స్ ట్యాంకులు, జావెలిన్ అండ్ స్టింగర్ మిసైల్స్తో పాటు ఇతర ఆయుధాలు, పేలుడు పదార్థాలను ఉక్రెయిన్కు అమెరికా అందజేసింది.
ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ, ఇతర పశ్చిమ దేశాధినేతలు.. రష్యాలోని సైనిక లక్ష్యాలపై దీర్ఘశ్రేణి క్షిపణులతో దాడులకు ఉక్రెయిన్ను అనుమతించాలని బైడెన్పై నెలల తరబడి ఒత్తిడి చేస్తున్నారు. అమెరికా నిషేధం వల్ల ఉక్రెయిన్ తన నగరాలు, విద్యుత్ వ్యవస్థలపై రష్యా దాడులను అడ్డుకోవడానికి చేసే ప్రయత్నాలు విఫలమవుతాయని వాదించారు. ఓ నివేదిక ప్రకారం.. రష్యాతో పోరాడుతోన్న ఉక్రెయిన్కు అమెరికా నిర్ణయం నష్టాన్ని కలిగిస్తుందని వాదించారు. ఈ చర్చ నాటో మిత్రదేశాల మధ్య విభేదాలకు బీజం వేసింది. దీనిపై బైడెన్ వ్యతిరేకిస్తూనే వచ్చారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. దీంతో ఆయన జనవరి 20న అమెరికాకు 47 వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడతారు. అంటే మరో రెండు నెలల్లో అధికారమార్పిడి జరగనుండగా జో బైడెన్ ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమవుతోంది. అమెరికా నిర్ణయం మరింత ఆజ్యం పోస్తుందని భావిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa