ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులపై చర్చించారు. ఈ క్రమంలోనే రైల్వే శాఖ మంత్రితో భేటీ అయిన పవన్ కళ్యాణ్.. పలు రైల్వే ప్రాజెక్టులపై అశ్వినీ వైష్ణవ్తో చర్చించారు. అలాగే పిఠాపురం పరిధిలో రైల్వే ఓర్ బ్రిడ్జి నిర్మించాలని.. నాలుగు ముఖ్మమైన రైళ్లకు పిఠాపురం రైల్వే స్టేషన్లో హాల్ట్ ఇవ్వాలని కోరారు. పిఠాపురంలోని పాదగయ క్షేత్రానికి భక్తుల రద్దీ పెరుగుతోందన్న పవన్ కళ్యాణ్.. వారి సౌకర్యం కోసం నాలుగు రైళ్లు ఆపాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై రైల్వే మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది.
ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. హస్తినలో బిజీబిజీగా గడిపారు. కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అవుతూ.. రాష్ట్ర అంశాలపై చర్చించారు. ఈ క్రమంలోనే రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్తో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీలోని రైల్వే ప్రాజెక్టులపై చర్చించారు. అలాగే పిఠాపురం పరిధిలోని రైల్వే పనుల గురించి పవన్ కళ్యాణ్.. కేంద్ర మంత్రికి పలు విజ్ఞప్తులు చేశారు. పిఠాపురం మున్సిపాలిటీ పరిధిలోని సామర్లకోట – ఉప్పాడ రోడ్డులో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. ఈ రోడ్డులో వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉన్న విషయాన్ని కేంద్ర మంత్రికి వివరించిన పవన్ కళ్యాణ్.. నిరంతరంగా ఉండే ట్రాఫిక్ రద్దీని పరిష్కరించడానికి, రోడ్ కనెక్టివిటీని మెరుగుపరచడానికి రైల్వే ఓవర్ బ్రిడ్జి అవసరమని అన్నారు. ఈ ప్రాజెక్టును ప్రధానమంత్రి గతి శక్తి కార్యక్రమం ద్వారా మంజూరు చేయాలని కోరారు.
అలాగే పిఠాపురంలోని శ్రీపాద వల్లభ స్వామి దేవాలయానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారని రైల్వే శాఖ మంత్రికి తెలిపిన పవన్ కళ్యా్ణ్.. భక్తులకు వీలుగా ఉండేలా నాలుగు ముఖ్యమైన రైళ్ళకు పిఠాపురం రైల్వే స్టేషన్లో హాల్ట్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. నాందేడ్ - సంబల్పూర్ నాగావళి ఎక్స్ప్రెస్, నాందేడ్ - విశాఖపట్నం సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, విశాఖపట్నం- సాయినగర్ షిర్డీ ఎక్స్ప్రెస్, విశాఖపట్నం- న్యూఢిల్లీ ఏపీ ఎక్స్ప్రెస్లకు పిఠాపురంలో హాల్ట్ ఇవ్వాలని కోరారు. అలాగే మహారాష్ట్ర లాతూర్ నుంచి తిరుపతికి రైలు ఏర్పాటు చేయాలని కోరారు. పవన్ కళ్యాణ్ ప్రతిపాదనలపై కేంద్ర రైల్వే మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది.
మరోవైపు ఢిల్లీ పర్యటనలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తోనూ పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంత రహదారుల అభివృద్ధికి రుణాల్లో వెసలుబాటు కావాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ రోడ్ల ప్రాజెక్ట్ కోసం ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ నుంచి తీసుకొన్న రుణానికి సంబంధించి ప్రాజెక్టును 2026 డిసెంబర్ 31 వరకు పొడిగించాలని పవన్ కళ్యాణ్ నిర్మలా సీతారామన్ను కోరారు. అలాగే రుణ ఒప్పందంలో పేర్కొన్న ప్రకారం రీయింబర్స్మెంట్ పద్దతిలో కాకుండా ముందస్తు చెల్లింపు పద్ధతిలో కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ప్రస్తుతం ఉన్న నిధుల కేటాయింపులోనూ మార్పులు చేయాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa