ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కొత్త రైలు మార్గానికి సంబంధించి కసరత్తు జరుగుతోంది. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం నుంచి గుంటూరు జిల్లా అమరావతి మీదుగా నంబూరు వరకు 57 కి.మీ. మేర రైల్వే లైన్ నిర్మాణానికి భూసేకరణ జరుగుతోంది. ఈ మేరకు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండల పరిధిలో భూ సేకరణ చేపట్టారు అధికారులు. చిలుకూరు, దాములూరులో రైల్వే, రెవెన్యూ అధికారులు భూసేకరణపై ప్రజాభిప్రాయ సేకరణ చేశారు. చిలుకూరు, దాములూరు గ్రామాల రైతులు సరికొత్త ప్రతిపాదనను తీసుకొచ్చారు.. రాజధాని అమరావతి కోసం భూములు సేకరించిన పద్ధతిలోనే ఈ భూముల్ని సేకరించాలని రైల్వే రెవెన్యూ అధికారులను కోరారు.
రాజధాని అమరావతిని కలుపుతూ.. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం నుంచి గుంటూరు జిల్లా నంబూరు వరకు నిర్మించనున్న నూతన రైల్వే లైను నిర్మాణం కోసం భూమిని సేకరిస్తున్నామని అధికారులు తెలిపారు. ఈ రైల్వే లైన్కు సంబంధించి.. చిలుకూరు, దాములూరు పరిధిలో 75 ఎకరాల భూమిని సేకరిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు రైతులకు భూ సేకరణకు సంబంధించిన విధివిధానాలను వివరించారు. అయితే కొందరు రైతులు భూ సేకరణకు సంబంధించి.. అమరావతి భూసేకరణ అంశాన్ని ప్రస్తావించారు.
ప్రస్తుతం మార్కెట్ ధరల ప్రకారం సేకరించిన భూములకు నష్టపరిహారం చెల్లించాలని రైతులు అధికారుల్ని కోరారు. అలాగే తమ పొలాలకు, ఊరిలోకి రాకపోకలు కొనసాగించేందుకు సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేయాలన్నారు. ఈ రైల్వే మార్గం కోసం భూములు కోల్పోయిన రైతుల కుటుంబ సభ్యులకు రైల్వేలో ఉద్యోగాలు ఇవ్వాలని అధికారుల్ని రిక్వెస్ట్ చేశారు. అంతేకాదు దాములూరు, చిలుకూరు, కొత్తపేటలకు కూడలిగా ఉన్న చిలుకూరు శివారులో రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. అయితే రైతుల డిమాండ్లను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామని రైల్వే, రెవెన్యూ అధికారులు తెలిపారు.
ఈ రైల్వే లైన్ ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం దగ్గర మొదలవుతుంది.. అమరావతి మీదుగా, విజయవాడ- గుంటూరు లైన్లోని నంబూరు దగ్గర కలుస్తుంది. ఎర్రుపాలంలో మొదలైన తర్వాత.. పెద్దాపురం, చెన్నారావుపాలెం, గొట్టుముక్కల, పరిటాల, కొత్తపేట, వడ్డమాను, అమరావతి, తాడికొండ, కొప్పురావూరు. వీటిలో కూడా అమరావతి, పెద్దాపురం, కొప్పురావూరు స్టేషన్లు పెద్దగా నిర్మించనున్నారు. ఈ రైల్వే లైన్లో భాగంగా.. కృష్ణా నదిపై 3.2 కి.మీ పొడవైన బ్రిడ్జ్ని నిర్మించనున్నారు. అంతేకాదు ఈ రైల్వే లైన్ పూర్తయితే.. కాజీపేట నుంచి వచ్చే రైళ్లు ఎర్రుపాలెం దగ్గర కొత్త లైన్లోకి వచ్చి అమరావతి మీదుగా నంబూరుకు వెళ్లొచ్చు. అక్కడి నుంచి న్యూ గుంటూరు స్టేషన్ మీదుగా హౌరా- చెన్నై ప్రధాన లైన్లోని తెనాలి దగ్గర కలిసి చెన్నై వైపు వెళ్లే అవకాశం ఉంటుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa