నిత్యం బిజీ బిజీగా ఉండే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం సాయంత్రం ఓ సినిమా చూడనున్నారు. పార్లమెంట్ ఆవరణలోని బాలయోగి ఆడిటోరియంలో ప్రదర్శించే ఆ సినిమా పేరు ‘ది సబర్మతి రిపోర్ట్’. గోద్రా రైలు దహనం, గుజరాత్ అల్లర్ల ఆధారంగా బాలీవుడ్ దర్శకుడు ధీరజ్ సర్నా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాపై ఇటీవలే ప్రధాని మోదీ ట్విట్టర్ లో ప్రశంసలు కురిపించారు. అబద్ధం ఎల్లకాలం ప్రచారంలో ఉండదని, ఆలస్యంగానైనా నిజం బయటకు వస్తుందనే విషయాన్ని సబర్మతి రిపోర్ట్ సినిమా మరోమారు నిరూపించిందని మెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే సోమవారం ఈ సినిమాను బాలయోగి ఆడిటోరియంలో ప్రదర్శించే ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని మోదీ ఇతర నేతలతో కలిసి ఈ సినిమాను వీక్షిస్తారని జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి.2002లో గుజరాత్లో జరిగిన అల్లర్లు, గోద్రా రైలు దహనకాండ దేశాన్ని కలచివేశాయి. గోద్రా పట్టణంలో 2002 ఫిబ్రవరి 27న రైల్వేస్టేషన్ లో నిలిచి ఉన్న సబర్మతి ఎక్స్ ప్రెస్ కు దుండగులు నిప్పు పెట్టారు. దీంతో అందులోని ప్రయాణికులలో 59 మంది చనిపోయారు. ఈ ఘటన ఆధారంగా ధీరజ్ సర్నా ‘ది సబర్మతి రిపోర్ట్’ సినిమాను రూపొందించారు. ఇందులో విక్రాంత్ మాస్సే, రాశీఖన్నా ప్రధాన పాత్రల్లో నటించగా రిధి డోగ్రా కీలకపాత్ర పోషించారు. ఈ సినిమా నవంబర్ 15న థియేటర్లలో విడుదలైంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa