ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కొన్నిరోజుల కింద కాకినాడ పోర్టులో తనిఖీలు చేపట్టిన నేపథ్యంలో, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో స్పందించారు. రాష్ట్రంలో పీడీఎస్ బియ్యం విదేశాలకు తరలించడం వెనుక పెద్ద మాఫియా ఉందని, ఇదో జాతీయస్థాయి కుంభకోణం అని పేర్కొన్నారు. అక్రమ బియ్యాన్ని పట్టుకునేందుకు బోట్లు వేసుకుని సముద్రంలో హడావిడి చేయడం కాదు... నిజాలు వెలికి తీయాలి... ఈ మేరకు కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అని షర్మిల స్పష్టం చేశారు. "పేదల పొట్టకొట్టి రూ.48 వేల కోట్ల ప్రజల డబ్బును పందికొక్కుల్లా తినేశారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా వెనుక ప్రజా ప్రతినిధుల హస్తం ఉంది. క్షేత్రస్థాయి నుంచి ఉన్నతస్థాయి వరకు కొంతమంది అవినీతి అధికారుల పాత్ర ఉంది. ఎవరికి దక్కాల్సిన వాటా వాళ్లకు చేరుతుండడంతో నిఘా వ్యవస్థ పూర్తిగా కళ్లు మూసుకుంది! గత మూడేళ్లలో ఏపీలోని పోర్టుల నుంచి 2 కోట్ల టన్నుల రేషన్ బియ్యం అక్రమంగా రవాణా అయింది. దీన్ని బట్టే మన చెక్ పోస్టుల పనితీరు ఎలా ఉందో అంచనా వేయొచ్చు. పేదలకు చెందాల్సిన రేషన్ బియ్యం పోర్టుల వరకు ఎలా వెళుతోంది? గత ప్రభుత్వ పెద్దలకు రైస్ మాఫియాతో లింకులు ఉన్నాయా? ఇందులో మిల్లర్ల చేతివాటం ఉందా? రేషన్ డీలర్ల మాయాజాలమా? ప్రతి రోజు తనిఖీల సంగతేంటి? ఈ నిజాలు వెలికితీయాల్సిన అవసరం ఉంది. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు కమిటీ వేయాలి. లేకపోతే విచారణ బాధ్యతలు సీబీఐకి అప్పగించండి. ఏపీ అంటే అన్నపూర్ణమ్మ... మనది ప్రపంచానికి అన్నం పెట్టే రాష్ట్రం. అలాంటి రాష్ట్రాన్ని రేషన్ బియ్యం మాఫియాకు అడ్డాగా మార్చారు. కష్టపడి పంట పండించే రైతుకు కన్నీళ్లు దక్కుతుంటే... బియ్యం అక్రమార్కులకు కాసులు దక్కుతున్నాయి... ఇదీ మన రాష్ట్ర దుస్థితి" అంటూ షర్మిల సోషల్ మీడియాలో ధ్వజమెత్తారు. తన పోస్టుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లను ట్యాగ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa