టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ, కూటమి అభ్యర్థుల గెలుపు కోసం పనిచేసిన ఎన్ఆర్ఐలకు అద్భుతమైన అవకాశం కల్పించారు. డే విత్ సీబీఎన్ పేరుతో.. చంద్రబాబు ఎన్ఆర్ఐతో రోజంతా గడుపుతారు. ఈ డే విత్ సీబీఎన్లో తొలి అవకాశం స్వీడన్ నుంచి వచ్చి ఐదు నెలలపాటు టీడీపీ కోసం క్షేత్రస్థాయిలో పనిచేసిన ఎన్నారై ఉన్నం నవీన్కుమార్ను ముఖ్యమంత్రి చంద్రబాబు గౌరవించారు. ఉండవల్లి నివాసానికి ఉన్న నవీన్కుమార్ను ఆహ్వానించి రోజంతా తనతో ఉండే అవకాశాన్ని కల్పించారు చంద్రబాబు. రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎలాంటి లాభాపేక్ష లేకుండా పనిచేసిన ఎన్నారైల కృషి అభినందనీయం, స్ఫూర్తిదాయకమని నవీన్ను అభినందించారు. సీఎం నిర్వహించిన పలు సమీక్షల్లో నవీన్ కూడా పాల్గొనడం విశేషం.
ఎన్నారై నవీన్ కుమార్ కుప్పం, శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట, చంద్రగిరి నియోజకవర్గాల్లో పనిచేశారు. ఆయన దాదాపుగా 1800 మంది ప్రభావశీల వ్యక్తులతో ఫోన్లో మాట్లాడారు.. అందుకే ఆయనకు ఈ అవకాశం దక్కింది. సార్వత్రిక ఎన్నికల సమయంలో టీడీపీ ఎన్నారై విభాగం ఆధ్వర్యంలో.. ఎంతోమంది ప్రవాసాంధ్రులు క్షేత్రస్థాయిలో పార్టీ కోసం పనిచేశారు. వీరికి డే విత్ సీబీఎన్ కార్యక్రమం ద్వారా.. రోజంతా చంద్రబాబుతో ఉండే అవకాశం దక్కింది. తెలుగు దేశం పార్టీ కోసం కష్టపడి పనిచేసి, అత్యుత్తమ ప్రతిభకనబరిచిన ఎన్నారైలకు చంద్రబాబుతో ఒక రోజంతా ఉండే అవకాశం కల్పిస్తామని (డే విత్ సీబీఎన్) గతంలో హామీ ఇచ్చారు. అందుకే నవీన్కు అవకాశం దక్కింది.
మరోవైపు ఎన్నారైలకు సంబంధించి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సీఆర్డీఏ పరిధిలో ఆస్తుల కొనుగోలుకు ముందుకొచ్చే ఎన్నారైలకు రాష్ట్ర ప్రభుత్వం రెడ్కార్పెట్ పరుస్తోంది. వారు ఆస్తుల కొనుగోలులో ఎలాంటి అసౌకర్యం లేకుండా న్యాయ సలహాల దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ వరకు ప్రభుత్వం అండగా ఉండి సహాకారాన్ని అందిస్తుంది. అమరావతిలో స్థలాల పరిశీల నుంచి రిజిస్ట్రేషన్ల వరకు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా రిజిస్ట్రేషన్ శాఖ ఆధ్వర్యంలో సీఆర్డీఏ పరిధిలో ప్రత్యేకంగా ప్రాపర్టీ ఫెసిలిటేషన్ సెంటర్ను ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
సీఆర్డీఏ పరిధిలో ఆస్తులు కొనుగోలు చేసేందుకు ఎన్నారైలు ముందుకు వస్తారని ప్రభుత్వం భావిస్తోంది. ఇలా ఆసక్తి ఉండి వచ్చేవారికి ఆస్తుల కొనుగోలు విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారుల్ని ఆదేశించారు. ఈమేరకు సీఆర్డీఏలో 24 గంటలూ పనిచేసేలా ప్రాపర్టీ ఫెసిలిటేషన్ కేంద్రాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఈ సెంటర్లో రిజిస్ట్రేషన్, రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలు ఉంటాయి. ప్రధానంగా వర్చువల్గా స్థలాలను పరిశీలించే అవకాశాన్ని కల్పిస్తారు. టైటిల్ వెరిఫికేషన్, సర్వే, డాక్యుమెంట్ రైటింగ్, స్టాంపింగ్ ఇతర సౌకర్యాలను ప్రాపర్టీ ఫెసిలిటేషన్ కేంద్రంలో కల్పిస్తారు.. ఏపీ ఎన్నార్టీ సహకారంతో ఈ సెంటర్ నిర్వహిస్తారు.
ఎన్నారైలకు ఆస్తుల క్రయ, విక్రయాల కోసం రిజిస్ట్రేషన్ పరంగా.. ఆధార్ కార్డు విషయంలో ఇబ్బందులు ఉన్నాయి. విదేశాల నుంచి వచ్చే వారి పాసుపోర్టు ఆధారంగా రిజిస్ట్రేషన్లు జరిగేందుకు వీలుగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కేంద్రానికి చెందిన నేషనల్ సెక్యూరిటీ డిపాజిటరీ లిమిటెడ్ సహకారంతో పాస్పోర్టులోని వివరాలు ధ్రువీకరించుకుంటారు.. ఈ సౌకర్యాన్ని కార్డు-2.0లో కల్పిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa