గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులు ఇక రోజూ రెండుసార్లు ముఖ హాజరు వేయాల్సిందే. ఆ మేరకు ప్రభుత్వం నిర్ణయించింది. సోమవారం నుంచే అమలు చేసింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల్లో ఎక్కువ మంది విధులకు ఎప్పుడు వస్తున్నారో తెలియని పరిస్థితి ఏర్పడింది. గతంలో వలంటీర్లను ఏర్పాటు చేయడంతో వారి ద్వారానే సచివాలయ ఉద్యోగులు పనిచేయిస్తూ కాలం వెల్లబుచ్చారు. అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సచివాలయ వ్యవస్థపై దృష్టిసారించింది. ప్రజాప్రతినిధులు, అధికారులు తనిఖీలకు వెళ్లిన సమయంలో ఆయా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగులు ఉండటం లేదు. ఈ విషయాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే గ్రామంలో లేదా వార్డులో పరిశీలనకు వెళ్లారు, మండల కేంద్రానికి వెళ్లారు అంటూ రకరకాల కారణాలు చెప్పి తప్పించుకుంటున్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సచివాలయ ఉద్యోగుల ద్వారా సామాజిక పింఛన్ల పంపిణీతోపాటు ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాల అమలు, పలురకాల విధులను కేటాయించింది. వాటితోపాటు ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం పూట ఇతర ఉద్యోగుల తరహాలో ముఖహాజరు తప్పనిసరిగా వేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు సచివాలయాల్లో ఇష్టారీతిన వ్యవహరించిన ఉద్యోగులు తాజా ఉత్తర్వులతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సాధారణంగా ఒకపూట ముఖ హాజరు వేసి సాయంత్రం ఇంటికి వెళ్లే సమయంలో మరొకసారి హాజరు వేయాల్సి ఉంది. కానీ సచివాలయ ఉద్యోగులకు మాత్రం ఉదయం పదిన్నర లోపు, సాయంత్రం ఐదు గంటలకు తప్పని సరిగా ముఖహాజరు వేస్తేనే ఆ రోజు విధుల్లో ఉన్నట్లు లెక్క. ఒకపూట వేయకపోయినా ఆ రోజు సెలవు కింద పరిగణిస్తారు. ఈ ముఖ హాజరు కూడా ఆ సచివాలయ పరిధిలోని 500 మీటర్ల లోపే వేయాల్సి ఉంది. ఎక్కడో కూర్చొని హాజరు వేయాలనుకుంటే ఇక కుదరదు. ఇప్పుడు తప్పనిసరిగా ముఖహాజరు వేయాల్సి రావడంతో వారిలో ఆందోళన నెలకొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa