ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అదృష్టం అంటే రఘురామదే.. రెండుసార్లు తప్పింది కానీ.. మూడోసారి వరించింది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 06, 2024, 06:39 PM

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకు మరో గౌరవం లభించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రఘురామకృష్ణరాజుకు కేబినెట్ హోదా కల్పించింది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. పొలిటికల్ సెక్రటరీ సురేష్ కుమార్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఉండి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన రఘురామకృష్ణరాజును ఇటీవలే డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయనకు కేబినెట్ హోదా కూడా కల్పించారు. డిప్యూటీ స్పీకర్ పదవిలో కొనసాగినంత కాలం రఘురామకు కేబినెట్ హోదా వర్తించనుంది. కేబినెట్ హోదాకు అనుగుణంగా రఘురామకృష్ణరాజుకు ప్రోటోకాల్, సెక్యూరిటీ కల్పించనున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక డిప్యూటీ స్పీకర్‌కు కేబినెట్ హోదా కల్పించడం ఇదే తొలిసారని తెలిసింది.


రఘురామకృష్ణరాజు 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరుఫున నరసాపురం లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత ఆ పార్టీతో, వైఎస్ జగన్ విధానాలతోనూ విభేదించారు. దీంతో పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. అయితే వైసీపీ విధానాలపై పోరాటం చేస్తూ వచ్చిన రఘురామకృష్ణరాజు.. 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో టీడీపీలో చేరారు. నరసాపురం ఎంపీగా మరోసారి పోటీ చేయాలని భావించినప్పటికీ.. కూటమి పొత్తుల్లో ఆ సీటు కాస్తా బీజేపీకి వెళ్లిపోయింది. దీంతో ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రఘురామకృష్ణరాజును టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బరిలోకి దింపారు.


ఉండి అసెంబ్లీ టీడీపీ టికెట్‌ను అప్పటికే మంతెన రామరాజుకు కేటాయించినప్పటికీ చివరి నిమిషంలో మార్పులు చేసిన చంద్రబాబు నాయుడు.. రఘురామకృష్ణరాజును అక్కడి నుంచి బరిలోకి దింపారు. ఇక అధినేత నమ్మకాన్ని నిజం చేస్తూ రఘురామకృష్ణరాజు 50 వేల పైచిలుకు ఓట్ల తేడాతో విజయం సాధించారు. అనంతరం టీడీపీ కూటమి సర్కారులో మంత్రి పదవి దక్కుతుందని అందరూ అంచనా వేశారు. అయితే సామాజిక సమీకరణాలు, కూటమి పొత్తు నేపథ్యంలో రఘురామకృష్ణరాజుకు మంత్రి పదవి తప్పిపోయింది. ఆ తర్వాత అసెంబ్లీ స్పీకర్ పదవి దక్కుతుందని వార్తలు రాగా.. టీడీపీలో సీనియర్ అయిన చింతకాయల అయ్యన్నపాత్రుడిని స్పీకర్‌గా ఎన్నుకున్నారు.


ఈ క్రమంలోనే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామకృష్ణరాజును ఇటీవల ఎన్నుకున్నారు. మంత్రి, అసెంబ్లీ స్పీకర్ పదవుల్లో ఉండేవారి కేబినెట్ హోదా కల్పిస్తారు. అయితే కేబినెట్ హోదా ఉన్న ఆ రెండు పదవులు తప్పిపోయినప్పటికీ.. డిప్యూటీ స్పీకర్ హోదాలో రఘురామకృష్ణరాజుకు కేబినెట్ ర్యాంక్ దక్కడం విశేషం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa