హీరో అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారిన సంగతి తెలిసిందే. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంపై తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖులు ఒక్కొక్కరు స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రియాక్టయ్యారు. అల్లు అర్జున్ అరెస్ట్ను ఖండిస్తూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.
" హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్ల ఆ కుటుంబానికి జరిగిన నష్టం ఎవ్వరూ తీర్చలేనిది. అదే సమయంలో దీనిపై తన విచారాన్ని వ్యక్తం చేసి, ఆ కుటుంబానికి అండగా ఉంటానంటూ అల్లు అర్జున్ బాధ్యతాయుతంగా వ్యవహరించారు. అయితే ఈ ఘటనకు నేరుగా అతడ్ని బాధ్యుడ్ని చేయడం ఎంతవరకు సమంజసం? తొక్కిసలాట ఘటనలో తన ప్రమేయం లేకపోయినా అర్జున్పై క్రిమినల్ కేసులు బనాయించి, అరెస్టు చేయడం సమ్మతం కాదు. అల్లు అర్జున్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను." అంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు.
పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా డిసెంబర్ 4న హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఉన్న సంధ్య థియేటర్ వద్ద భారీగా జనం గుమికూడారు. ఇదే సమయంలో థియేటర్లో సినిమా చూడ్డానికి అల్లు అర్జున్ కూడా వచ్చారు. ఈ క్రమంలోనే తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ చనిపోయారు. ఆమె కుమారుడికి తీవ్ర గాయాలు కాగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై వివిధ సెక్షన్ల కింద చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో అల్లు అర్జున్ను 11వ నిందితుడిగా చేర్చారు. ఈ కేసులో ఇప్పటికే ఏడుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు.. శుక్రవారం అల్లు అర్జున్ను కూడా అదుపులోకి తీసుకున్నారు.
అల్లు అర్జున్ను విచారించిన పోలీసులు.. వాంగ్మూలం కూడా నమోదు చేశారు. గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరచగా.. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ను చంచల్గూడ జైలుకు తరలించారు. అయితే ఈ విషయంలో అల్లు అర్జున్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ విచారించిన హైకోర్టు.. అల్లు అర్జున్కు మధ్యంతర బెయిల్ ఇచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa