ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. రాష్ట్రంలో విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీని 4.0ను రూపొందించింది. ఈ పాలసీ నిబంధనలు 2024-29 మధ్య అమలులో ఉంటాయని.. విద్యుత్తు వాహనాల (ఈవీ) తయారీదారులతోపాటుగా కొనుగోలుదారులకూ రాయితీలు ప్రకటించింది. ఎలక్ట్రిక్ బైక్లు, ఆటోలు, బస్సులు, రవాణా వాహనాలు, ట్రాక్టర్లకు ఎక్స్షోరూం ధరలో 5 శాతం రాయితీ వర్తిస్తుంది. ఆర్వీఎస్ఎస్ ఆపరేటర్ నుంచి సర్టిఫికెట్ ఆఫ్ డిపాజిట్ తీసుకుంటే ధరలో 10 శాతం రాయితీ వస్తుంది. ఈ ప్రోత్సాహకం 2027 మార్చి వరకు మాత్రమే వర్తిస్తుంది.
రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చేసుకున్న అన్ని ఎలక్ట్రిక్ వాహనాలకు ఐదేళ్లపాటు రోడ్డు ట్యాక్స్ మినహాయింపు.. హైబ్రిడ్ నాలుగు చక్రాల వాహనాలకు మినహాయింపు వర్తించదు అని పాలసీలో పేర్కొన్నారు. అలాగే ఎక్స్ షోరూమ్ ధరకు కూడా పరిమితి విధించారు.. బైక్లకు గరిష్ఠంగా రూ.లక్ష, మూడు టైర్ల వాహనాలకు రూ.2 లక్షలు, విద్యుత్ బస్సుకు రూ.2 కోట్లు, సరకు రవాణా వాహనానికి రూ.5 లక్షలు, ట్రాక్టర్కు రూ.6 లక్షలు వరకు పరిమితిగా తీసుకుని రాయితీ వర్తిస్తుంది. మొదటి 5 వేల ఛార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసే వారికి ఖర్చులో 25% (గరిష్ఠంగా రూ. 3లక్షల) వరకు రాయితీ కూడా ఉంటుంది.
2029 నాటికి 2 లక్షల విద్యుత్ బైక్లు రిజిస్టర్ చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. 2029 నాటికి కనీసం 10 వేల మూడు చక్రాల వాహనాలు.. 2029 నాటికి 20 వేల కొత్త కార్లను తీసుకురావాలని టార్గెట్. ఆర్టీసీలో కూడా వందశాతం విద్యుత్ బస్సుల వినియోగం.. ప్రతి 30 కి.మీ.లకు ఒక విద్యుత్ ఛార్జింగ్ స్టేషన్ అందుబాటులోకి తేవాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ-మొబిలిటీ నగరాల నిర్మాణానికి రూ.500 కోట్లతో కార్పస్ ఫండ్.. ఈ-మొబిలిటీ స్టార్టప్లను ప్రోత్సహించేందుకు 100 ఇంక్యుబేషన్ సెంటర్ల ఏర్పాటును ప్రస్తావించారు. అలాగే ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారులకు కూడా ప్రభుత్వం వివిధ రకరాల రాయితీలను, ప్రోత్సాహకాలను ప్రకటించింది. ఈవీ రంగంతో అనుసంధానమైన భాగస్వామ్య పక్షాల నుంచి తీసుకున్న అభిప్రాయాల తీసుకుని పాలసీ విధానాలను రూపొందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa