శ్రీకాకుళం జిల్లా, మెళియాపుట్టి మండలంలో దొంగనోట్లు చెలామణీ చేస్తున్న సమాచారం అందింది. రూ.5లక్షలు ఇస్తే.. రూ.25లక్షలు దొంగనోట్లు ఇస్తామని ముఠా ఒప్పందం కుదర్చుకుంటున్నట్టు తెలిసింది. ఈ మేరకు ఎస్ఐ రమేష్బాబు.. సిబ్బందితో గురువారం పట్టుపురం వద్ద మాటు కాశారు. ఆ సమయంలో మెళియాపుట్టి మండలం సంతలక్ష్మీపురానికి చెందిన తమ్మిరెడ్డి రవి అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించాడు. ఆయన వద్ద పోలీసులు తనిఖీ చేయగా రూ.50వేల నకిలీ నోట్లు లభ్యమయ్యాయి. దీనిపై విచారణ చేపట్టగా కొంతమంది ముఠా సభ్యులు దొరికారు. తమ్మిరెడ్డి రవికి దొంగనోట్ల తయారీపై అనుభవం ఉంది. ఒడిశాలో నోట్లు తయారుచేసే పేపర్లు తీసుకువచ్చి.. దొంగనోట్లు ముద్రించేందుకు ప్రయత్నించాడు.
ఇందులో భాగంగా పలాస మండలం పెదంచల గ్రామానికి చెందిన కె.దుర్వాసులు, సంతలక్ష్మీపురానికి చెందిన తమ్మిరెడ్డి ఢిల్లీరావు, దాసరి కూమార్స్వామి, మెళియాపుట్టి మండలం కరజాడ వైసీపీ ఎంపీటీసీ సభ్యుడు దాసరి రవి, వజ్రపుకొత్తూరు మండల డోకులపాడు గ్రామానికి చెందిన దుమ్ము ధర్మారావు ముఠాగా ఏర్పడి దొంగనోట్లు ముద్రించారు. ఆ ఆరుగురిని అరెస్టు చేశాం. వారి వద్ద రూ.57.25 లక్షల దొంగనోట్లు లభ్యమయ్యాయి. వాటితోపాటు దొంగనోట్ల తయారీకి వినియోగించిన కలర్ జిరాక్స్ మిషన్, నాలుగు సెల్ఫోన్లు, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నాం. తమ్మిరెడ్డి రవి, కె.దుర్వాసులపై గతంలో పలాసలో వివిధ కేసులు నమోదయ్యాయి. ధర్మారావుపై కూడా మందస, కాశీబుగ్గ పోలీసుస్టేషన్లలో దొంగతనం కేసులు నమోదయ్యాయి. వీరు రూ.200, రూ.500 నకిలీ నోట్లు తయారు చేస్తున్నట్టు గుర్తించాం. మరికొంతమంది పరారీలో ఉన్నారని, వారిని కూడా త్వరలో పట్టుకుంటామ’ని డీఎస్పీ డీఎస్ఆర్వీఎన్ మూర్తి తెలిపారు. ఈ కేసును ఛేదించిన పాతపట్నం సీఐ రామారావు, ఎస్ఐ రమేష్బాబు, సిబ్బంది వైకుంఠరావు, సూర్యం, జగన్ తదితరులను ఎస్పీ కేవీ మహేంద్రరెడ్డి ప్రత్యేకంగా అబినందించారని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa