టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి బీఆర్ నాయుడు తిరుమల వ్యవహారాల్లో తనదైన ముద్రవేస్తున్నారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తామని ఆయన తొలి రోజు నుంచి చెబుతున్నారు. ఈ క్రమంలో తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు.జనవరి 10 నుంచి 19 వరకు తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు కల్పిస్తున్నట్టు బీఆర్ నాయుడు నేడు ఒక ప్రకటనలో వెల్లడించారు. అయితే, ఈ సమయంలో అన్ని రకాల ప్రత్యేక దర్శనాలు రద్దు చేస్తున్నట్టు తెలిపారు. టోకెన్లు కలిగిన భక్తులకు మాత్రమే స్వామివారి దర్శనాలకు అనుమతి ఇస్తున్నట్టు స్పష్టం చేశారు. ఎంతో విశిష్టత కలిగిన వైకుంఠ ఏకాదశి పర్వదినం నేపథ్యంలో తిరుమల ఆలయంలో ప్రతి ఏడాది వైకుంఠ ద్వార దర్శనాలు కల్పిస్తుండడం తెలిసిందే. ఈ మేరకు టీటీడీ ఇప్పటి నుంచే విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. సామాన్య భక్తులను దృష్టిలో పెట్టుకుని కీలక నిర్ణయాలు తీసుకుంది. మాజీ ప్రజాప్రతినిధులు, మాజీ అధికారులు, మాజీ చైర్మన్ లను వైకుంఠ ఏకాదశి (జనవరి 10) రోజున దర్శనాలకు అనుమతించబోమని బీఆర్ నాయుడు స్పష్టం చేశారు. జనవరి 10 నుంచి 19 వరకు ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా, వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్టు తెలిపారు. అంతేకాకుండా, పసిబిడ్డలు, దివ్యాంగులు, వృద్ధులు, రక్షణ శాఖ, ఎన్నారై తదితర విశేష దర్శనాలను ఈ పది రోజుల పాటు రద్దు చేస్తున్నామని బీఆర్ నాయుడు వివరించారు. ఇక... దర్శన టోకెన్లు, స్పెషల్ దర్శన్ టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే దర్శనాలకు అనుమతిస్తామని... టోకెన్లు లేని భక్తులను తిరుమల కొండపైకి అనుమతిస్తాం కానీ, స్వామి వారి దర్శనానికి అనుమతి ఉండదని స్పష్టం చేశారు. భక్తులకు కేటాయించిన టైమ్ స్లాట్ ప్రకారం, నిర్ణీత సమయానికి క్యూలైన్ల వద్దకు చేరుకోవాలని సూచించారు. గతంలో మాదిరిగా భారీ క్యూలైన్లు ఇక ఉండవని, ఈసారి సాధ్యమైనంత మేర గరిష్ఠ సంఖ్యలో భక్తులకు స్వామివారి దర్శనం కల్పించే ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. గోవిందమాల ధరించిన భక్తులకు ఎటువంటి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు ఉండవని... దర్శన టోకెన్లు, టికెట్లు ఉన్న భక్తులకే శ్రీవారి దర్శనం అని బీఆర్ నాయుడు పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa