ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నెలకు రూ.5 వేల గ్యారెంటీ పెన్షన్.. ఈ కేంద్ర పథకంలో 7 కోట్ల మంది

business |  Suryaa Desk  | Published : Sun, Dec 15, 2024, 09:57 PM

 అసంఘటిత రంగంలోని కార్మికులకు వృద్ధాప్యంలో స్థిరమైన పెన్షన్ అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అద్భుతమైన పథకాన్ని అందిస్తోంది. అదే అటల్ పెన్షన్ యోజన (Atal pension yojana). ఇందులో చేరిన వారికి 60 ఏళ్ల వయసు నుంచి నెల నెలా పెన్షన్ వస్తుంది. 2015లో కేంద్ర ప్రభుత్వం 3 సామాజిక భద్రతా పథకాలను లాంచ్ చేసింది. అందులో అటల్ పెన్షన్ స్కీమ్ ఒకటి. తాజాగా ఈ స్కీమ్ గురించి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. ఈ పథకంలో ఇప్పటి వరకు 7 కోట్లకుపైగా మంది చేరినట్లు తెలిపింది. ఈ స్కీమ్‌లో చేరడం ద్వారా గరిష్ఠంగా నెలకు రూ.5 వేల పెన్షన్ పొందవచ్చు. ఆ వివరాలు తెలుసుకుందాం.


ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా అటల్ పెన్షన్ యోజన గురించి పలు విషయాలు వెల్లడించింది. ' అటల్ పెన్షన్ యోజన కింద ఏడు కోట్ల కంటే ఎక్కువ మంది సబ్‌స్క్రైబర్లతో హామీ ఇవ్వబడిన పెన్షన్ బెనిఫిట్‌లతో సురక్షితమైన రిటైర్మెంట్ను అందిస్తోంది. దీని ద్వారా లబ్ధిదారులకు పదవీ విరమణ తర్వాత మనశ్సాంతి లభిస్తుంది. డిసెంబర్ 2, 2024 నాటికి మొత్తం 7.15 కోట్ల సబ్‌స్క్రైబర్లు తమ పేరును నమోదు చేసుకున్నారు. అందులో 47 శాతం మంది మహిళలే ఉన్నారు.' అని పేర్కొంది.


ఈ పథకంలో చేరాలంటే 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. పోస్టాఫీసు లేదా బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్ కలిగి ఉండాలి. అయితే నేషనల్ పెన్షన్ స్కీమ్ పరిధిలో ఉన్న వారు అనర్హులు. ట్యాక్స్ చెల్లించే వారు సైతం దరఖాస్తు చేసుకునేందుకు కుదరదు. అలాగే పెట్టుబడి అనేది వయసును బట్టి మారుతుంటుంది. పెట్టుబడిని బట్టి నెలకు కనీసం రూ.1000 నుంచి రూ.5000 వరకు పెన్షన్ వస్తుంది. 18 ఏళ్ల వయసులో చేరి రిటైర్మెంట్ వరకు ప్రీమియం చెల్లిస్తున్నారు అనుకుందాం. నెలకు కనీసం రూ.42 నుంచి గరిష్ఠంగా రూ.210 వరకు చెల్లించవచ్చు. 40 ఏళ్ల వయసు వారు అయితే రూ.291 నుంచి రూ.1454 వరకు కట్టాల్సి ఉంటుంది. దీని బట్టే నెలకు రూ.1000, రూ.2000, రూ.3000, రూ.4000, రూ.5000 పెన్షన్ వస్తుంది.


18 ఏళ్ల వయసులో చేరి 60 ఏళ్ల నుంచి నెలకు రూ.5 వేల పెన్షన్ రావాలంటే నెలకు రూ.210 చొప్పున కడుతూ ఉండాలి. 40 ఏళ్ల వయసులో చేరిన వారు రూ.1454 చెల్లిస్తే నెలకు రూ.5 వేల పెన్షన్ వస్తుంది. కనీస పెట్టుబడి అయితే నెలకు రూ.1000 వస్తుంది. పోస్టాఫీసు లేదా బ్యాంకుకు వెళ్లి ఇందులో చేరవచ్చు. ఈ స్కీమ్‌లో చేరిన వ్యక్తి మరణిస్తే జీవిత భాగస్వామికి పెన్షన్ వస్తుంది. జీవిత భాగస్వామి సైతం మరణిస్తే నామినీకి ప్రీమియం డబ్బులు చెల్లిస్తారు. నెలవారీ, మూడు నెలలు, ఆరు నెలలుగా ఎంచుకోవచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa